ఇందిరాగాంధీ కారు నేను తొలగించలేదు: కిరణ్ బేడీ, ఆఫీస్పై దాడి...
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుమతిలేని ప్రదేశంలో ఆమె కారు ఉంటే దానిని తాను తొలగించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ఖండించారు.
తాను పర్యవేక్షిస్తున్న ట్రాఫిక్ విభాగంలో ఓ ఎస్సై మాత్రం ఆ కారును తొలగించారన్నారు. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచిందంటే అప్పటి ప్రధాని ఇందిర నేరుగా వెళ్లి యుద్ధం చేశారని అర్థమా అని ప్రశ్నించారు.
ట్రాఫిక్ డీసీపీగా ఉన్నప్పుడు తన అధికారులను రక్షించుకోవాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పారు. అలాగే వాహనాలను తొలగించే క్రేన్లకు తాను తోడ్పాటును అందించే దానిని అని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అర్ధరాత్రి పూట విరాళాలు వస్తాయని అవమ్ అనే సంస్థ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తే, దానిని అరవింద్ కేజ్రీవాల్ ఖండించిన విషయం తెలిసిందే.

కిరణ్ బేడీ కార్యాలయం పైన దాడి!
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరమ్ బేడీ కార్యాలయం పైన సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కిరణ్ బేడీ పోటీ చేస్తున్న కృష్ణా నగర్లోని కార్యాలయం పైన జరిగిన ఈ దాడిలో భవనం అద్దాలు పగిలిపోయాయి.
దాడి సందర్బంగా కార్యాలయంలో ఉన్న కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి పైన సమాచారం అందుకున్న కిరణ్ బేడీ తన ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లారు. దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications