ఆజాద్ ఇష్యూ, బిజెపిలో కలకలం: జోషి-అద్వానీ భేటీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతున్నట్లుగా కనిపిస్తోంది. డిడిసిఎ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా కీర్తి ఆజాద్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బుధవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
కీర్తి ఆజాద్కు పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రామ్ జెత్మలానీ, శతృఘ్ను సిన్హాలు ఆయనకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత మరో బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా మాట్లాడుతూ... కీర్తి ఆజాద్ వంటి నిజాయితీపరుడ్ని పార్టీ వదులుకోదని చెప్పారు.
కీర్తి ఆజాద్ మాట్లాడుతూ... తనకు పలువురు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. తనకు నోటీసు అందిందని, దీనిపై తాను సమాధానం చెబుతాన్నారు. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు రాసే పత్రం విషయంలో సుబ్రహ్మణ్య స్వామి తనకు సహకరిస్తానని చెప్పారన్నారు.
మరోవైపు, గురువారం నాడు బీజేపీ అగ్రనేతలు మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీ, శాంత కుమార్లు భేటీ అయ్యారు. వారు కీర్తి ఆజాద్ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. జోషి నివాసంలో వారు భేటీ అయ్యారు. ఇప్పటికే మోడీ - అమిత్ షాల పైన అసంతృప్తితో ఉన్న సీనియర్లు, ఇతరులు కీర్తి ఆజాద్కు మద్దతుగా నిలవనున్నారు.