ఢిల్లీలోని ఆరెస్సెస్ కార్యాలయం ముందు కిస్ ఆఫ్ లవ్
న్యూఢిల్లీ: 'కిస్ ఆఫ్ లవ్' నిరసనలు న్యూఢిల్లీకి కూడా చేరుకున్నాయి. శనివారం నాడు పలువురు ఆందోళనకారులు దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కిస్ ఆఫ్ లవ్ పేరిట వారు నిరసన తెలిపారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఆరెస్సెస్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఆరెస్సెస్ కార్యాలయం ముందు ఆందోళనకు ప్రయత్నించారు. అంతకుముందే నిరసన చేపడుతున్నట్లు నిర్వాహకులు ఫేస్బుక్లో పెట్టారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ పేరుతో దేశవ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.
మోరల్ పోలిసింగ్కు నిరసనగా కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో కిస్ ఆఫ్ లవ్ తర్వాత విద్యార్థులు హగ్ ఆఫ్ లవ్ కార్యక్రమం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పది మంది విద్యార్థులు కళాశాల నుంచి సస్పెన్షన్కు గురయ్యారు.
కొజీకోడ్లోని డౌన్టౌన్ హోటల్ వద్ద నిర్వహించిన కిస్ ఆఫ్ లవ్కు సంఘీభావంగా మహారాజ కళాశాల విద్యార్థులు హగ్ ఆఫ్ లవ్ నిర్వహించారు. నవంబర్ 2వ తేదీన మెరైన్ డ్రైవ్ మైదానంలో కిస్ ఆఫ్ లవ్ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొద్ది మంది విద్యార్థులు కళాశాల వద్ద గుమిగూడి కళాశాల అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ వినకుండా కౌగిలింతల కార్యక్రమం నిర్వహించారు.
హగ్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కళాశాల అధికారులు ముందుగానే హెచ్చరించారు. ఆ కార్యక్రమ నిర్వహణకు ముందుగా ఏ విధమైన అనుమతి తీసుకోలేదని, అనుమతి లేకుండా ఆ కార్యక్రమం నిర్వహించినందుకు గాను పది మంది విద్యార్థులను పది రోజుల పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేశామని కాలేజీ ప్రిన్సిపాల్ టివి ఫ్రాన్సీ చెప్పారు.
మీడియా ప్రచారంతో కిస్ ఆఫ్ లవ్కు విపరీతమైన ప్రచారం లభించింది. దాదాపు 30 మందిని పోలీసులు ముందుగానే అరెస్టు చేయడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు, సానుభూతిపరులు చేపట్టలేకపోయారు.