మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక, సమావేశానికి వెంకట్ రెడ్డి గైర్హాజరు..ఢిల్లీలోనే ఉండి
మునుగోడు బై పోల్ మీద అన్నీ పార్టీలు ఫోకస్ చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల విషయంలో ఆచి తూచి స్పందిస్తోన్నాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోమవారం ఢిల్లీలో ఓ కీలక భేటీ నిర్వహించింది. సమావేశానికి రావాలని తెలంగాణ నేతలకు ఏఐసీసీ ఆహ్వానం పంపింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై చర్చ జరిగింది.
కీలకమైన సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాలేదు. వాస్తవానికి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో ఉన్న వెంకట్ రెడ్డి... పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి వెళ్లారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే హైదరాబాద్ వచ్చేశారని సమాచారం. అంటే కావాలనే అభ్యర్థి ఎంపిక చేసే సమావేశానికి దూరంగా ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఆయనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తన సొదరుడితో పాటు తననూ కలిసి దూషించారని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వడం లేదని అలకబూనారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి రాలేనని కూడా వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.
టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరమైతే బాగుండదు.బై పోల్లో ఊహించని ఫలితాలు ఎదురవుతాయనే భావనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. వెంకట్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. అయినా వెంకట్ రెడ్డి వినడం లేదు. అందుకోసమే కీలకమైన సమావేశానికి దూరంగా ఉన్నారు.