KSRTC కేరళదే: 7ఏళ్ల పోరాటంలో కర్ణాటకకు చుక్కెదురు -పేటెంట్ కంట్రోలర్ తీర్పు ఇదే..
కేఎస్ఆర్టీసీ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ అని. తెలుగు రాష్ట్రాల్లోనూ కేఎస్ఆర్టీసీ బస్సుల సేవలుండటం తెలిసిందే. అయితే, ఇకపై కేఎస్ఆర్టీసీ కర్ణాటకు చెందింది కాదు.. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ మాత్రమే. ఈ రెండు రాష్ట్రాల మధ్య కేఎస్ఆర్టీసీ ట్రేడ్మార్క్ సంక్షిప్తపదంపై ఏడేళ్లుగా నలుగుతోన్న వివాదానికి శుక్రవారం తెరపడింది..
ఇండియన్ పేటెంట్ ఆఫీస్ గా పిలుచుకునే కేంద్ర ప్రభుత్వ సంస్థ 'ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్మార్క్'.. కేఎస్ఆర్టీసీ వివాదంపై తీర్పు వెల్లడించింది. కేఎస్ఆర్టీసీ ట్రేడ్మార్క్ కేరళకే చెందుతుందని, సంక్షిప్త పదంతోపాటు రెండు ఏనుగుల చిహ్నంపై కేరళకే హక్కులు ఉంటాయని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఇకపై కేఎస్ఆర్టీసీ పదాన్ని ఉపయోగించకూడదని వెల్లడించింది.
ఇరు రాష్ట్రాల రోడ్ ట్రాన్స్పోర్టు శాఖకు ఘన చరిత్రే ఉంది. మొదట్లో కేరళ రోడ్ ట్రాన్స్పోర్టును ట్రావెన్కోర్ స్టేట్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్గా వ్యవహరించేవారు. ఆ తర్వాత 1965 ఏప్రిల్ 1 నుంచి కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్గా పేరు మార్చారు. మరోవైపు కర్ణాటక ట్రాన్స్పోర్టు పూర్వం మైసూర్ గవర్న్మెంట్ రోడ్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్గా ఉండేది.. 1973లో దాన్ని కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టుగా మార్చారు. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాలు కేఎస్ఆర్టీసీ పేరుతోనే ప్రజారవాణా సేవలు అందిస్తున్నాయి.
అయితే, కర్ణాటక రాష్ట్రం కేఎస్ఆర్టీసీ ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం 2014లో దరఖాస్తు చేసింది. ఈ సంక్షిప్త పదంపై హక్కులు తమవేనంటూ కేరళకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. కేఎస్ఆర్టీసీ ట్రేడ్మార్క్ హక్కులు తమకే ఉంటాయని వాదించింది. ఎట్టకేలకు ఈ న్యాయపోరాటంలో కేరళ గెలుపొంది.. మేధో సంపత్తి హక్కులను దక్కించుకుంది.