సీమాంధ్ర మిత్రులకు...: కెటిఆర్, హరీష్, కోదండ స్పందన
న్యూఢిల్లీ: సీమాంధ్ర మిత్రులకు తాము ఒక్కటే చెబుతున్నామని ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అందరూ కలసి ఉందామని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా సంయమనంతో ఉండాలన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు లోకసభలో ఆమోదం పొందడం ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందన్నారు.
తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి కూడా కట్టుబడి ఉన్నారని చెప్పారు. సభలో బిల్లుపై చర్చకు వచ్చినందున కెసిఆర్ సీమాంధ్ర సమస్యలకు అనుకూలంగా మాట్లాడుతారన్నారు. సాటి తెలుగువారిగా సీమాంధ్రుల పైన తమకు ప్రేమ ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా కలిసింది, రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని తెరాస మరో ఎమ్మెల్యే నేత హరీష్ రావు అన్నారు. ఈ విజయం కెసిఆర్, జయశంకర్లదే అని చెప్పారు. హైదరాబాదులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కోట్లాదిమంది తెలంగాణ కలను నిజం చేసిన సోనియాకు కృతజ్ఞతలు అన్నారు.
బిల్లు లోకసభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభలో కూడా పొందుతుందని కోదండరామ్ అన్నారు. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా బిల్లు లోకసభలో ఆమోదం పొందుతుందన్నారు. సహకరించిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. మనం రాష్ట్రాలుగా విడిపోతున్నాం తప్ప తెలుగు వారిగా కాదన్నారు.












Click it and Unblock the Notifications