కుంభమేళాలో భారీ ఏర్పాట్లు.. 2800 కోట్లతో తాత్కాలిక టెంట్ సిటీ..!
ఉత్తర ప్రదేశ్ : ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 49 రోజుల పాటు జరగనున్న ఈ మహాక్రతువుకు సంబంధించి యూపీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ సిటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కుంభమేళాకు చాలా విశిష్టత ఉంది. గ్రీకుల నాగరికత నుంచి కుంభను స్వీకరించినట్లు చెబుతారు. కుంభ అంటే పెద్దమొత్తంలో ధనం అని అర్థం. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో రెట్ల మోక్షం లభిస్తుందనేది నమ్మకం. సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. వంద మాఘమాస స్నానాలు, వెయ్యి కార్తీక మాస స్నానాలు, కోటి వైశాఖ మాస స్నానాలు.. ఇవన్నీ కూడ గంగానదిలో ఒక్కసారి చేసే స్నానంతో సమానమంటారు.
తాత్కాలిక నగరం.. అద్భుతమైన ఏర్పాట్లు
కుంభమేళా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. గంగ, యమునా నది ఒడ్డున 100 హెక్టార్లలో ఆధునిక సౌకర్యాలతో టెంపరరీ టెంట్ సిటీని నిర్మించింది. నది పరిసరాల్లో భారీ సంఖ్యలో గుడారాలు వేయించింది. వాటిలో అన్ని రకాల వసతులు కల్పించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరమని పేర్కొంది. వీటి నిర్వహణకు దాదాపు 2,800 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాదు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు వేయించింది. 22 తాత్కాలిక వంతెనలు, లక్షా 25 వేల టాయిలెట్స్, 50వేల వరకు ఎల్ఈడీ లైట్లు సిద్ధం చేసింది.
దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాకు వస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతేకాదు పవర్ సప్లైకి అనుకోకుండా అంతరాయం ఏర్పడితే అటోమెటిక్ గా కరెంట్ వచ్చేలా 8 వందల జనరేటర్లు సిద్ధం చేసింది. కోట్ల మంది భక్తులు రానుండటంతో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేస్తోంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు 20 వేల చెత్తడబ్బాలను సిద్ధం చేసింది.
పిల్లలు తప్పిపోతే..!
కోట్లమంది భక్తుల రాకతో కుంభమేళా జరిగే పరిసరాలు కిక్కిరిసిపోతుంటాయి. ఈనేపథ్యంలో చిన్న పిల్లలు కనిపించకుండా పోతే వెతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే యూపీ పోలీసులు కుంభమేళా సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ కడతారు. దీంతో పిల్లలు ఒకవేళ తప్పిపోయినా.. రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పిల్లలు ఎక్కడున్నారో కనుక్కోవచ్చు.
భక్తి వెనుక సైన్స్..!
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ఈ కుంభమేళా. ఈ అపూర్వ ఆధ్యాత్మిక సంగమం వెనుక చాలా కథనాలున్నాయి. భక్తిభావమే కాదు సైన్స్ కూడా దాగి ఉంది. దీనిపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. భక్తిశ్రద్ధలతో చేసే పుణ్యస్నానాలు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయనే విషయం రుజువయింది. నదీస్నానాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది కూడా పరిశోధనల్లో తేలింది. సహజసిద్ధంగా రోగాలు తగ్గిపోవడమే గాకుండా వత్తిడి కూడా దూరమవుతుందట.