జయ కోసం డాక్టర్లు హోమాలు, పూజలు చేశారు
చెన్నై: ప్రాణాంతక స్థితి నుంచి పరిరక్షిస్తాడన్న ఉద్దేశంతో వైద్యో నారాయణ హరి: అని అన్న నానుడి నెలకొంది. ఏ రోగం వచ్చినా మనం వైద్యులనే ఆశ్రయించి ప్రాణాలు కాపాడండి అని వేడుకోంటాం. వైద్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం అని నమ్ముతాం.
అయితే అలాంటి వైద్యులు తమిళనాడు అమ్మ జయలలిత అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు. ఇలాంటి ఘటన తమిళనాడులోని వీరరాఘవ పెరుమాళ్ ఆలయంలో సాక్షాత్కరించింది.
తమను మించిన అతీంద్రీయ శక్తి అమ్మ ప్రాణాల్ని కాపాడాలని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆయుష్టు హోమం, నరసింహ హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరీ హోమం, మహాసుదర్శన హోమం, అస్త్ర హోమం జరిగాయి.
హొమం చేసిన ప్రముఖులు
ఉంగలుక్కాగ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం వీరరాఘవుని సన్నిధిలో ఆరు హోమాలు నిర్వహించారు. ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్, ట్రస్టు అధ్యక్షుడు కె. సుబ్బారెడ్డి, అన్నాడీఎంకే రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు, తిరువళ్లేరు లోక్ సభ సభ్యుడు డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో హోమాలు చేశారు.
శాసన సభ్యులు హాజరు
అన్నాడీఎంకే శాసన సభ్యులు టి. బలరామన్, పి. ఏలుమలై, మాజీ ఎంఎల్ఏ సక్కుబాయి, పారిశ్రామిక వేత్తలు రంగారెడ్డి, రవిబాబు, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు హోమాలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వేదపండితులు
హోమాల సందర్బంగా వీరరాఘవ స్వామి ఆలయంలో పడింతులు చేసిన వేద మంత్రాలతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది. అన్నాడీఎంకే వైద్య విభాగానికి చెందిన వంద మంది డాక్టర్లు, పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు, స్వామివారి భక్తులు జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని వేడుకున్నారు.
అమ్మ కోసం
ప్రత్యేక పూజల అనంతరం ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్ మీడియాతో మాట్లాడుతూ మేము వైద్యులే అయినా అంతకు మించిన అతీంద్రీయ శక్తి ఆదేవుడికి ఉందని, అందుకే అమ్మను కాపాడాలని తాము హోమాలు చేశామని వివరించారు.
లక్షల మంది అమ్మను నమ్ముకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్లనే లక్షల మంది నేడు కడుపునిండా బోజనం తింటున్నారని చెప్పారు. అలాంటి అమ్మ క్షేమంగా తిరిగిరావాలని రాష్ట్రం మొత్తం దేవుడిని ప్రార్థిస్తుందని, తాము అందులో భాగం అయ్యామని డాక్టర్ సునీల్ చెప్పారు.
అమ్మ కోసం ప్రజలు, ప్రజల కోసం అమ్మ
అనుక్షణం ప్రజల కోసం పాటుపడి, వారి కోసం ఆలోచించిన అమ్మ జయలలిత నేడు అనారోగ్యానికి గురికావడం ప్రజలను కలచివేస్తుందని ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ అమ్మ కోసం పూజలు చెయ్యాలని మనవి చేశారు.
దీపపూజలు
ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలతో పాటు ఒకే సారి దీపపూజలు నిర్వహించారు. టీనగర్ లోని వినాయకుడి గుడిలో 108 దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో దీప పూజలు చేశారు.