రిసార్ట్ హామీలు: ఇవ్వకపోతే వెళ్లిపోతాం, సీఎంకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వార్నింగ్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారైపోతుందని తెలిసింది. ఇంత కాలం వెంట ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యడం, గ్రూపులు గ్రూపులుగా విడిపోయి ఇప్పుడు పళనిసామికి సినిమా చూపిస్తున్నారు.
తాజాగా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా ? లేదా ? అంటూ సీఎంను నిలదీసే స్థాయికి చేరుకున్నారని వెలుగు చూసింది. మేము ఇచ్చిన మాట ప్రకారం మీకు మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశామని, అయితే మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవడం లేదని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు బుధవారం ఎడప్పాడి పళనిసామిని నిలదీశారని వెలుగు చూసింది.
రిసార్ట్ లో ఏం చెప్పారు ?
పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలను కువత్తూరు రిసార్టుకు తీసుకు వెళ్లిన మన్నార్ గుడి ముఠా సభ్యులు శశికళకు మద్దతు ఇవ్వాలని వారికి నచ్చచెప్పారు. మాకు మద్దతు ఇస్తే మీకు ఏం కావాలన్నా చూసుకుంటాం ? అంటూ హామీ ఇచ్చారని సమాచారం.
కువత్తూరులోనే సీన్ రివర్స్
కువత్తూరు రిసార్ట్ లో ఎమ్మెల్యేలను బుజ్జిగిస్తున్న సమయంలో సుప్రీం కోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. తరువాత శశికళ తన వారసుడిగా ఎడప్పాడి పళనిసామి సీఎం అవుతారని చెప్పి ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారు.
హామీ ఇచ్చి మన్నార్ గుడి మాయం
శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత పార్టీలో అన్నీ తానై నడిపించాడు. మీకు ఇచ్చిన హామీలు త్వరలోనే నెరవేర్చుతామని వారికి నచ్చచెప్పి ఇన్ని రోజులు కాలం గడిపారు.
దినకరన్ జైలుకు వెళ్లాడు
ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో మన్నార్ గుడి మాఫియా కీలక వ్యక్తులు కనపడం లేదు.
మా డిమాండ్లు తీర్చండి
కొవత్తూరు రిసార్ట్ లో మీరు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాలని, లేదంటే బయటకు వెళ్లిపోతామని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ సీనియర్ మంత్రులతో ఎడప్పాడి పళనిసామికి రాయబారం పంపించారని తెలిసింది. అయితే రిసార్ట్ లో ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీలు ఇచ్చారు అనే విషయం మాత్రం బయటకు రావడం లేదు.