ఎంటర్టైన్మెంట్ లేకే అత్యాచారాలు: యుపి పోలీసులు
లక్నో: పాశ్చాత్య సంస్కృతి, మొబైల్ ఫోన్స్ తోపాటు వినోదం లేకపోవడం కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయని ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్పారు. ఓ సమాచార హక్కు కార్యకర్త అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పోలీసులు ఈ మేరకు జవాబిచ్చారు.
సమాచార హక్కు కార్యకర్త లోకేష్ ఖురానా గత జులై నెలలో రాష్ట్ర పోలీసు విభాగానికి ఓ లేఖ రాశారు. అత్యధిక జనాభా గల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో అత్యాచారాలు జరగడానికి కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై 62 జిల్లాల పోలీసు విభాగాల నుంచి బుధవారం అతనికి ఈ వింత సమాధానం అందింది.
వినోదానికి అవకాశాలు లేకపోవడంతో మహిళలు, యువతులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఫిరోజాబాద్ జిల్లాలోని నాసిర్పూర్ పోలీసులు చెప్పారు. మహిళలు, యువతులు ధరించే వస్త్రాలు కూడా ఇందుకు కారణంగానే ఉంటున్నాయని ఫిరోజాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

టీవీ, అసభ్య ప్రకటనలు మహిళలపై అత్యాచారాలకు కారణమవుతున్నాయని మొరాదాబాద్ జిల్లా పోలీసులు తెలిపారు. మహిళలు ధరించే దుస్తులు, వారి వ్యవహారశైలి, మొబైల్ ఫోన్స్, అసభ్య గీతాలు అత్యాచారాలకు కారణమవుతున్నాయని అలహాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
యువతీ యువకుల మధ్య పెరిగిన సొషలైజేషన్ కూడా అత్యాచారానికి కారణమవుతోందని ఎటావా పోలీస్ స్టేషన్ తెలిపింది. అసభ్య చిత్రాలు, అక్రమ సంబంధాలు అత్యాచారాలకు దారితీస్తున్నాయని హాపూర్ పోలీసులు చెప్పారు. మొబైల్ ఫోన్లు అత్యాచార ఘటనలు పెరగడానికి ఎక్కువగా కారణమవుతున్నాయని తెలిపారు.
మహిళలపై ఇలాంటి దారుణమైన ఆలోచలను, నేరాలను ఆపేదెలా అని సమాచార హక్కు కార్యకర్త ఖురానా ప్రశ్నించారు. నేరాలను ఎలా అరికడతారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఖురానా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర డిజిపి 75 జిల్లాల పోలీసు అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు అత్యాచారాలకు పై విధంగా కారణాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications