ఇన్నాళ్లు అణగదొక్కారు... ఇక పై లడఖ్లో మంచి రోజులు: ఎంపీసేరింగ్ నమ్గ్యాల్
జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్సభలో లడఖ్ ఎంపీ సేరింగ్ నమ్గ్యాల్ మాట్లాడారు . జమ్మూ కశ్మీర్ విభజనను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంతకాలం లడఖ్ ప్రజలకు తీరని అన్యాయం జరిగేదని చెప్పిన సేరింగ్... లడఖ్ ప్రాంతంను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడంతో ఇకపై తమ పౌరులకు అన్ని విధాలా మేలు చేకూరుతుందన్న విశ్వాసం కలుగుతోందని చెప్పారు. అభివృద్ధి, గుర్తింపు, భాషా ఇల్లా అన్నిట్లో తాము వెనకబాటుకు గురయ్యామని అన్నారు. వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ , ఆర్టికల్ 370 మాత్రమే అని అన్నారు.
ముందునుంచి కూడా కశ్మీర్తో కలవాలన్న ఉద్దేశం లడఖ్ ప్రాంత ప్రజలది కాదని అన్నారు సేరింగ్. జమ్మూ కశ్మీర్ను విభజన చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా తీసుకురావడం అందులో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడాన్ని తమ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. లడఖ్లో ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ముందు నుంచి కూడా తమను జమ్మూ కశ్మీర్తో కాకుండా వేరుగా పరిగణించాలని పోరాడుతున్నామని అయితే తమ పోరాటాన్ని ఎవరూ పట్టించుకోలేదని సభకు తెలిపారు.

లడఖ్, కార్గిల్ ప్రాంత ప్రజలు విభజనతో సంతోషంగా లేరన్న కాంగ్రెస్ మాటలతో ఎంపీ సేరింగ్ ఏకీభవించలేదు. ఇంకా ఎంతకాలం అక్కడి ప్రజలను మభ్య పెడుతారని ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ పాలకులకు సమయం దగ్గరపడిందని చెప్పారు. ఇప్పుడు అక్కడి ప్రజల గొంతుకను వినే ప్రభుత్వం కేంద్రంలో ఉందని కొనియాడారు. తమకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆత్మవిశ్వాసాన్ని లడఖ్ ఎంపీ సేరింగ్ వ్యక్తం చేశారు.
సోమవారం రోజున రాజ్యసభలో ముందుగా ఆర్టికల్ 370 రద్దు చేస్తూ అమిత్ షా తీర్మానం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కొన్ని పార్టీలు వ్యతిరేకించగా మెజార్టీ పార్టీలు మాత్రం ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. బీజేపీ అంటే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే బీఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తమ మద్దతు తెలిపాయి. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 125 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటువేయగా.. 61 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది.












Click it and Unblock the Notifications