బట్టలిప్పేసి మహిళపై లైంగిక దాడి: 14 మందిపై కేసు
అహ్మద్నగర్: చికిత్సకోసం ఆస్పత్రికి బయలుదేరిన ఓ మహిళపై మహారాష్ట్రలో దారుణం జరిగింది. నడిరోడ్డుపైనే బట్టలిప్పి లైంగిక దాడికి తెగబడ్డారు. మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో మొత్తం 14మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అహ్మద్నగర్ జిల్లా వదాలీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ ఈ నెల 14న వైద్యం కోసం సమీపంలోని ఖాస్తీ గ్రామానికి నడచుకుంటూ బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ యువకుడు ఆమెను బలవంతంగా బైక్పై ఎక్కించుకున్నాడు. దీన్ని గమనించిన ఖాస్తీ గ్రామస్తులు కొందరు బైక్ను ఆపి, మహిళపై కట్టెలతో దాడి చేశారు.
అనంతరం బట్టలిప్పి పరుగులుతీయించారు. ఆపై గ్రామస్తుల్లో ఒకడు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అతికష్టమ్మీద తన ఇంటికి చేరుకోగా, వదాలీ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు కూడా దాడి చేసి, కాలువలో పడేశారు.
మరుసటిరోజు స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అహ్మద్నగర్ దవాఖానలో చికిత్సపొందుతున్న బాధితురాలు, మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. మంగళవారం సాయంత్రం ఆమె నుంచి దాడి వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు.
యువకుడితో బైక్పై వెళ్లినందుకే దాడి జరిగి ఉంటుందని పోలీసులు అంటున్నారు. మొత్తం 14మందిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. పోలీసుల తీరు సరిగ్గాలేదని, ఘటన జరిగి ఆరురోజులవుతున్నా కనీసం నిందితులను అదుపులోకి తీసుకోలేకపోయారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.