లఖింపూర్ ఖేరీ హింసాకాండ: మృతుల కుటుంబాలకు రూ. 45 లక్షల పరిహారం, ఇంటికో జాబ్ : యూపీ సర్కార్
లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనలో మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. మరణించిన రైతుల కుటుంబాలకు రూ .45 లక్షల పరిహారం చెల్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాలకు రూ .45 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు, గాయపడిన వారికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. లఖింపూర్ ఖేరీ హింస ఘటనలో బాధిత కుటుంబాలలో ఒక్కో కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించింది.
లఖింపూర్ ఖేరిలో హింసాకాండలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం
యుపి పోలీసు ఎడిజి (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ సోమవారం మాట్లాడుతూ, లఖింపూర్ ఖేరిలో హింసాకాండలో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ .45 లక్షలు ఇవ్వనుందని , ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనుందని గాయపడిన వారికి రూ. 10 లక్షలు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేస్తామని చెప్పారు.
ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, సిఆర్పిసి సెక్షన్ 144 అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు జిల్లా పర్యటనకు అనుమతించబడలేదని చెప్పారు. అయితే, రైతు సంఘాల సభ్యులు ఇక్కడికి రావడానికి అనుమతించబడ్డారు. లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళనలో హింస చెలరేగడంతో ఆదివారం ఎనిమిది మంది మరణించారు.
రైతులపై దూసుకెళ్లిన కాన్వాయ్ వాహనం.. నలుగురు రైతులు మృతి
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు కారణమైంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యుపి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య లు బన్బీర్ పూర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో, మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలియజేయడానికి భారతీయ కిసాన్ యూనియన్ కు చెందిన పలువురు రైతులు నల్లజెండాలతో వెళ్లారు .
టికోనియా బన్బీర్ పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్న రైతులకు మీదికి కాన్వాయ్ లోని ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు రైతులపై దూసుకుపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు.
తర్వాత ఘర్షణలు .. వాహనాలు దగ్ధం.. యూపీ వెళ్తున్న నేతల అడ్డగింత
ఆ తర్వాత రైతులు ఆగ్రహంతో అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ వాహనంతో పాటు మరో మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. నలుగురు రైతులు మరణించిన ఘటన తర్వాత జరిగిన ఘర్షణలో మరో నలుగురు మరణించారు. ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు కూడా మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం రాజీనామా చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళిన నేతలను యూపీ పోలీసులు అడ్డుకున్నారు.
ప్రియాంకా గాంధీ వాద్రా అరెస్ట్ .. గెస్ట్ హౌస్ లో నిరాహార దీక్ష
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు ఈ ఉదయం అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె పోలీసులను నిలదీశారు. ప్రియాంక గాంధీ వాద్రాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. 5 గంటల పాటు ప్రియాంక గాంధీ వాద్రా హౌస్ అరెస్ట్ లో ఉండి, తర్వాత పోలీసుల నుండి తప్పించుకొని లఖింపూర్ ఖేరి కి బయల్దేరారు. మరోమారు పోలీసులు ప్రియాంక గాంధీ వాద్రా ను హర్గావ్ వద్ద అరెస్ట్ చేసి, ఆమెను అనేక ప్రాంతాలకు తిప్పుతూ చివరకు ఆమెను ఒక అతిధి గృహంలో పోలీసులు నిర్బంధించారు. సీతాపూర్ అతిథిగృహంలో పోలీసుల నిర్బంధంలో ఉన్న ప్రియాంక గాంధీ వాద్రా చీపురు పట్టుకొని ఊడ్చి అక్కడే తను నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.