లాలూ కొడుకులకు కేబినెట్ హోదా! బిజెపికి శివసేన చురక
పాట్నా/ముంబై: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాకూటమి నూతన మంత్రివర్గం ఏర్పాటు పైన కసరత్తు చేస్తోంది. మహాకూటమిలో భాగంగా ఉన్న జెడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందనున్నారు.
నితీష్ కుమార్ ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20న ఛాత్ పూజ అనంతరం నితీష్ కుమార్ నేతృత్వంలోని మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
బీహార్ కేబినెట్లో 35 మందికి అవకాశం లభించనుందని తెలుస్తోంది. ఇందులో ఆర్జేడీ నుంచి పదహారు, జెడీయూ నుంచి పద్నాలుగు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది.
ఆర్డేజీ నుంచి గెలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు తేజ్ ప్రతాప్, తేజస్విలకు కేబినెట్ హోదాతో కూడిన మంత్రి పదవులు లభించనున్నాయని తెలుస్తోంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో 80 స్థానాల్లో ఆర్జేడీ గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది.
బిజెపికి శివసేన చురక
బీహార్లో బిజెపి ఓటమి నేపథ్యంలో సొంత పార్టీ నేతలతో పాటు మిత్రపక్షాలు బిజెపిని టార్గెట్ చేశాయి. ఇటీవల తరచుగా కమలం పార్టీపై మండిపడుతున్న శివసేన... బిహార్ ఓటమిపై తన పత్రిక సామ్నాలో ఘాటుగా స్పందించింది. ఎల్లప్పుడు మోసగించడం రాజకీయాల్లో పని చేయదని పేర్కొంది.
హామీలను నెరవేర్చని పక్షంలో ప్రజలు తగిన సమయంలో బుద్ధిచెబుతారంటూ విమర్శించింది. పెద్ద పెద్ద అలలు వచ్చి పోతుంటాయని, కాని వాటి ఆనవాళ్లు కనిపించవని, సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకూడా అలాంటిదేనని శివసేన వ్యాఖ్యానించింది. ఏడాది ఎన్టీయే పాలనలో ధరాభారం తప్ప సాధారణ ప్రజలకు ఒరిగిందేమీలేదని పేర్కొంది.