ప్రమాదానికి క్షణాల ముందు సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ (వీడియో)
న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో ఆర్మీ హెలికాప్టర్.. దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం ఈ దృశ్యాల్లో కనిపించింది. ఆ తర్వాత పెద్ద శబ్దంతో హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది.
ఈ దృశ్యాలు స్థానికులు సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి. వీడియోలో కనిపిస్తున్న స్థానికులు హెలికాప్టర్ ప్రమాదంతో కొంత ఆందోళనకు గురైనట్లు కనిపిస్తోంది. కాగా, ఈ వీడియోతో ఆ ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలావుండగా, ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద స్థలిని గురువారం ఉదయం వాయుసేన అధికారులు పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి బ్లాక్బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్బాక్స్ కీలకంగా మారింది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీన్ని డీకోడ్ చేసేందుకు ఢిల్లీకి తరలించనున్నారు.
#WATCH | Final moments of Mi-17 chopper carrying CDS Bipin Rawat and 13 others before it crashed near Coonoor, Tamil Nadu yesterday
— ANI (@ANI) December 9, 2021
(Video Source: Locals present near accident spot) pic.twitter.com/jzdf0lGU5L
కాగా, జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో తదుపరి త్రిదళాధిపతి( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్)గా ఎవరు నియమితులవుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆర్మీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతుల్లో ఒకరిని సీనియార్టీ ప్రకారం ఈ పదవికి ఎంపిక చేస్తారు. నేవీ, వాయుసేనల అధిపతులు ఇటీవల కాలంలోనే పదవులు చేపట్టినందున వారిలో సీనియర్ అయిన జనరల్ నరవణేకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్మీ చీఫ్గా జనరల్ రావత్ నుంచి ఆయన 2019 డిసెంబర్ 31న బాధ్యతలు స్వీకరించారు.
నేవీ అధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కేవలం ఎనిమిది రోజుల క్రితం, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో జనరల్ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
నరవణె సీడీఎస్ బాధ్యతలు చేపడితే, ఆర్మీ అధిపతిగా నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ కుమార్ జోషీకి గానీ, ఆర్మ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ చండీ ప్రసాద్ మహంతిగానీ అవకాశాలున్నాయి. నేవీ, వాయుసేనల ప్రస్తుత చీఫ్ ల కన్నా లెఫ్టినెంట్ జనరల్ జోషీయే సీనియర్ కావడం గమనార్హం. అయితే, ఎయిర్ చీఫ్ మార్షల్గా రిటైరైన భదౌరియా కు కూడా సీడీఎస్ బాధ్యతలు చేపట్టేందుకు అర్హతలున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
కాగా, తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ తోపాటు మరో 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉండగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. జనవరి 1, 2020లో బిపిన్ రావత్ భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా నియమితులయ్యారు. అయితే, రావత్ కుటుంబం ఎన్నో తరాలు భారత సైన్యంలోనే పనిచేస్తున్నాయి.