ముద్దు పెట్టారు: జస్టిస్ గంగూలీపై విక్టిమ్ ఆరోపణ
న్యూఢిల్లీ/కోల్కతా: న్యాయ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకె గంగూలీ ఉదంతంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య న్యాయమూర్తుల కమిటీకి బాధితురాలు ఇచ్చిన అఫిడవిట్లోని వివరాలను అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్ అసాధారణ రీతిలో బయట పెట్టారు.
గంగూలీ రాజీనామా చేసేందుకు తిరస్కరించడం వల్లే తాను, బాధితురాలి పూర్తి సహకారంతో ఆమె అఫిడవిట్లోని అంశాలను బయటపెట్టానని జైసింగ్ తెలిపారు. గంగూలీ లాంటి వారు పదవిలో కొనసాగడానికి వీల్లేదని ఆమె అన్నారు. ఒకవేళ గంగూలీ పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయకపోతే, ఆయనకు ఉద్వాసన పలికే ప్రక్రియను రాష్ట్రపతి ప్రారంభించాలని జైసింగ్ అన్నారు. ఈ మేరకు తాను ప్రధానికి లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ 24న రిటైరైన గంగూలీ అదే రోజు ఢిల్లీలోని లె మెరిడియన్ హోటల్ గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన వద్ద ఇంటర్న్గా పనిచేసిన న్యాయ విద్యార్థిని ఆరోపించడం, ఆయన తోసిపుచ్చడం తెలిసిందే. అయితే హోటల్లో గంగూలీ ప్రవర్తన కామాపేక్షగా ఉందని సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ ఇటీవల అభిశంసించింది.
బాధితురాలు అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. నిరుడు డిసెంబర్లో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్యకు సంబంధించిన నివేదిక పూర్తి చేసే నిమిత్తం హోటల్ గదికి రావాలంటూ జస్టిస్ గంగూలీ పిలిచించారని బాధితురాలు తెలిపారు. ఆ నివేదికను ఉదయానికల్లా పూర్తి చేయాలని రాత్రంతా ఉండి పని చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. గదిలో ఉన్న సమయంలో రెడ్వైన్ సీసా బయటికి తీశారనీ, పడక గదిలో వైన్ తీసుకుంటూ రిలాక్సవాలన్నట్లుగా సూచించారని బాధితురాలు తెలిపారు.
అంతేగాక తన చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నారనీ, ఐ లవ్ యూ అంటూ పలుమార్లు చెప్పారని ఆమె తెలిపారు. తాను నిరాకరించి, తన వసతికి వెళ్లిపోయానని బాధితురాలు పేర్కొన్నారు. కాగా గంగూలీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి వెంటనే ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లూ వెల్లువెత్తున్నాయి. కోల్కతాలో పలువురు న్యాయవాదులు, మహిళలు జస్టిస్ గంగూలీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన కార్యాలయం ముందు కూర్చొని ధర్నా చేపట్టారు.