రైతుల ఆందోళనలో ఓ న్యాయవాది ఆత్మహత్య: వారి గోడు వినాలంటూ మోడీకి లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దులో రహదారులపై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయవాది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు రహదారులను దిగ్భంధం చేసి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా జిల్లా జలాలబాద్కు అమర్జీత్ సింగ్ రైతుల ఆందోళనలో పాల్గొన్న అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అమర్జీత్ సింగ్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. ఈ చట్టాలను నల్ల చట్టాలంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల గోడును వినిపించుకోవాలని కోరారు. అయితే, ఆ సూసైడ్ నోట్పై తేదీ మాత్రం డిసెంబర్ 18 అని ఉండటం గమనార్హం.
అమర్జీత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత వారి వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు హర్యానా పోలీసులు. ఇప్పటి వరకు రైతుల ఆందోళనకు సంబంధమున్న ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి రూ. ఆరు లక్షల అప్పు ఉందని తెలిసింది.
కాగా, గత నెల రోజులకుపైగా కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులోని రహదారులపై పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మూడు చట్టాలను రద్దు చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే ఐదు సార్లు కేంద్రంతో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. మళ్లీ డిసెంబర్ 29న కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.












Click it and Unblock the Notifications