కుక్కపై గొడవ: కొట్టి మహిళ దుస్తులిప్పేసిన లాయర్
న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన కుటుంబ సభ్యులతో పాటు అతను పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన ఆగస్టు 7వ తేదీన జరిగింది. మహిళ పని మనిషి మోహన్ (18) ఆమె పెంపుడు శునకంతో పాటు పార్కులో సంచరించడంపై వివాదం చెలరేగింది.
కుక్కతో పాటు మోహన్ పార్కులో తిరగడంపై పార్కు పక్కనే నివాసం ఉండే నిందితుడు ఎకె గుప్తా అభ్యంతరం చెప్పాడు. మోహన్ను దుర్భాషలాడాడు. మోహన్ సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినకుండా గుప్తా ఇనుప రాడ్ తీసుకుని మోహన్ను, శునకాన్ని కొట్టడం ప్రారంభించాడు. కుక్క తలపై గాయమైంది.
మోహన్ కేకలు విన్న మహిళ అక్కడికి చేరుకుని జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది. పార్కు నీ సొంతం కాదని తన భార్య గుప్తా చర్యకు అభ్యంతరం చెప్పిందని, దాంతో గుప్తా తన భార్య వెంట్రుకలు పట్టుకుని కొట్టాడని, గుప్తాకు అతని భార్య, ఇద్దరు కూతుళ్లు సహకరించారని, దాంతో తన భార్యకు తీవ్రమైన గాయాలు అయ్యాయని, రక్తం కారిందని బాధితురాలి భర్త సురేష్ యాదవ్ అంటున్నారు.