ఆ తర్వాత సర్దార్: మోడీ, హైద్రాబాద్ ఏమయ్యేదో: ఎల్కె
అహ్మదాబాద్: చాణుక్యిడి తర్వాత దేశాన్ని ఐక్యం చేసిన ఘనత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్దేనని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఐక్యతకు చిహ్నమన్నారు.
పటేల్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నర్మదా నది ఒడ్డున ఇవాళ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నామన్నారు. ఈ కార్యక్రమం చేపట్టేందుకు తనకు ఎంతోమంది స్ఫూర్తినిచ్చారన్నారు.
సర్దార్ పటేల్ జలాశయం వల్ల రైతులు, గిరిజనులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని, ప్రభుత్వం తాగు, సాగు నీటి కోసం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. సర్దార్ కలలు సాకారం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. వాజపేయి నాయకత్వంలో అణు పరీక్షలు నిర్వహించి సార్వభౌమత్వాన్ని చాటామని ఆయన చెప్పారు. నాటి నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదని దేశానికి ప్రతీకలన్నారు.
హైదరాబాద్, జునాఘడ్ విలీనంలో సర్దార్: అద్వానీ
సంస్థానాలను దేశంలో విలీనం చేయించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దేనని బిజెపి అగ్రనేత అద్వానీ అన్నారు. దేశం విడిచి వెళ్లిన ఆంగ్లేయులు సంస్థానాలను వారి ఇష్టానికి వదిలేశారని, పటేల్ వాటిని దేశంలో విలీనం చేయించారన్నారు.
పటేల్ లేకుంటే హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలు ఏమయ్యేవో అన్నారు. నిజాం పాలనలో మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.