తీరం దాటిన లెహర్ తుఫాను: తీవ్రత తగ్గిందని కమిషనర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను వణికించిన లెహర్ తుఫాను మచిలీపట్నం వద్ద తీరం దాటింది. లెహర్ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారి గురువారం మధ్యాహ్ననం మచిలీపట్నం వద్ద తీరం దాటింది. దీంతో తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
దీంతో సముద్రం పలు ప్రాంతాల్లో ముందుకు వచ్చింది. అలలు ఎగిసిపడుతున్నాయి. రెండు నుండి మూడు మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను తీరం దాటడంతో తీర ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. పునరావాస కేంద్రాల నుండి బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు.
లెహర్ తుఫాను కారణంగా రాగల పన్నెండు గంటల్లో తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. లెహర్ కొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుంది. రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయి.
కాగా, లెహర్ కారణంగా కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
లెహర్ తుఫాను తీవ్రత తగ్గింది: పార్థసారథి
లెహర్ తుఫాను నేపథ్యంలో విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. లెహర్ తుఫాను తీవ్రత తగ్గిందని చెప్పారు. తుఫాను కారణంగా కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కురుస్తాయన్నారు. జాలర్లు వేటకు వెళ్లవద్దని సూచించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికల తొలగింపు
లెహర్ తుఫాను తీరం దాటిన నేపథ్యంలో అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలను అధికారులు తొలగించారు. జాలర్లు వేటకు వెళ్లవద్దని తొలుత హెచ్చరించినప్పటికీ ఆ తర్వాత మత్య్సకారుల వేటపై నిషేధాజ్ఞలను ఉపసంహరించుకున్నారు.