ఖట్టర్ సర్కార్ అర్ధ సత్యాల పుట్ట: డేరాలో ఆయుధ శిక్షణపై 2010లోనే సైన్యం హెచ్చరిక
హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్తోపాటు జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లోనూ హింస ప్రజ్వరిల్లింది. ప్రత్యేకించి హర్యానాలో డేరా సచ్చా సౌదా అల్లకల్లోలం స్రుష్టించింది.
చండీగఢ్: హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్తోపాటు జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లోనూ హింస ప్రజ్వరిల్లింది. ప్రత్యేకించి హర్యానాలో డేరా సచ్చా సౌదా అల్లకల్లోలం స్రుష్టించింది. కానీ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అర్ధసత్యాలు చెప్తూ, రహస్య ఏజెండా అమలుచేస్తూ, పూర్తిగా అబద్దాలను బయటకు వదిలిందే తప్ప, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
దాని పర్యవసానమే కేవలం మూడు గంటల్లో 36 మంది మరణించగా, 250 మందికి పైగా సామాన్యులు గాయాల పాలయ్యారు. కోట్ల రూపాయల ఆస్తులు దెబ్బతిన్నాయి. తర్వాత మ్రుతులు 38కి చేరాయి. అది వేరే సంగతి.కానీ ఖట్టర్ ప్రభుత్వానికి రాష్ట్రంలో హింసాకాండ ఇదే మొదటి సారేం కాదు.
గతేడాది ఫిబ్రవరిలో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాట్లు నిర్వహించిన ఆందోళన కూడా హింసాత్మక రూపం దాల్చడంతోపాటు ఆందోళనకారులు యధేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా డేరా సచ్చా సౌదా అభిమానులు హర్యానా అంతటా రెచ్చిపోయి స్వైర విహారం చేశారు. డేరా అభిమానులు రెచ్చిపోయి విధ్వంసానికి దిగిన మూడు గంటల పాటు ఖట్టర్ సర్కార్ చేష్టలుడిగి వ్యవహరించిందన్న విమర్శలు వచ్చాయి. దాని ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితులు అద్వాన్నంగా మారాయి.
హర్యానా ప్రభుత్వ, పోలీసు అధికారులదీ అదే ధోరణి
అయితే మూడు గంటల్లో జరిగిన మారణ హోమం తమ వైఫల్యం ఫలితమేనని ఖట్టర్ అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. రాష్ట్రమంతటా హింస జరుగకముందు, తర్వాత కొన్ని గంటల పాటు సీఎం ఖట్టర్ మౌనాన్నే ఆశ్రయించారు. ఆయన సారథ్యంలోని ప్రభుత్వ, పోలీసు అధికారులు కూడా అదే పని చేశారు. డీజీపీ బీఎస్ సంధూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ ధేశీ, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాం నివాస్, అడ్వకేట్ జనరల్ బీఆర్ మహాజన్ తదితరులంతా పంజాబ్ అండ్ హర్యానా ఉమ్మడి హైకోర్టునూ, ప్రజలనూ, మీడియాను తడబాటుతో కూడిన అబద్ధాలతో, అర్థ సత్యాలతో తప్పుదోవ పట్టించడానికే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వచ్చాయి. హింస ప్రజర్విల్లిన కొన్ని గంటల తర్వాత గానీ ఖట్టర్.. పంచ్ కులలోని దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు పూనుకోలేదు. ఈ హింసాకాండలో ఎంత మంది మరణించారో తెలుసుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. మీడియా ముందు మాత్రం ‘ఐజీ సాబ్ 15 మంది మరణించారు' వ్యాఖ్యానించారు. 22 మంది మరణించారని మీడియా చెప్తే.. మీరు చెప్పారు కనుక 22 అనుకోవచ్చని నిర్లక్ష్య పూరిత సమాధానంతో సరిపెట్టారాయన.
పోలీసుల వైఫల్యంపై దాటవేత ధోరణి ఇలా
డేరా సచ్చా సౌదా అభిమానుల వల్ల జరిగే నష్టం చాలా తక్కువని వ్యాఖ్యానించినందుకు ఖట్టర్ పనితీరు, వ్యవహార శైలిని హైకోర్టు తప్పుబట్టింది కూడా. గమ్మత్తేమిటంటే ఈ ఎపిసోడ్ మొత్తంలోనూ డీజీపీ బీఎస్ సంధూ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారడమే. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి విఫల యత్నం చేశారు. డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీంను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత ఆయన మద్దతుదారులు స్రుష్టించిన విధ్వంసకాండను నిలువరించడంలో తమ పోలీసులు విఫలమయ్యారన్న, పారిపోయారన్న విమర్శలను తోసిపుచ్చారు. మీడియా ప్రతినిధుల వ్యక్తిగత సమాచారం, వీడియో, ఫోటోగ్రాఫిక్ సమాచారం మాత్రం.. తమ పోలీసులు బాధ్యతల నుంచి పారిపోలేదన్న డీజీపీ వాదనను తోసిపుచ్చుతున్నాయి.
డిప్యూటీ అడ్వకేట్ జనరల్, డీసీపీలపై ఇలా వేటు
గుర్మీత్ రాం రహీంతోపాటు ఆయన దత్తపుత్రిక హానీప్రీత్ను హెలికాప్టర్లో తరలించారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో డీజీపీ తన అహంకారాన్నే బయట పెట్టుకున్నారు. ఇలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని, దర్యాప్తు చేస్తామని సమాధానం ఇచ్చారు. గుర్మీత్తోపాటు పలు బ్యాగులు, సూట్ కేసులతో హానీప్రీత్ జైలుకు హెలికాప్టర్లో వెళ్లారు. డీజీపీ బీఎస్ సంధూతోపాటు చీఫ్ సెక్రటరీ ధేశీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విఫలయత్నం చేశారు. అంతే కాదు పంచ్కుల కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ లెక్సస్, మెర్సిడెస్ ఎస్యూవీ, జడ్ - ప్లస్ భద్రతాగార్డులు వాడే వాహనాలు కలిపి సుమారు 200 వాహనాల కాన్వాయ్ ను కూడా కోర్టు వద్దకు అనుమతించడంపైనా ఆ ఇద్దరు అధికారులు ఆత్మరక్షణకే ప్రయత్నించారు.
మీడియా పదేపదే గుర్మీత్ కు ఇస్తున్న వీఐపీ ట్రీట్మెంట్ వెలుగెత్తి చూపడంతో సౌదా చీఫ్తో అంటకాగిన డిప్యూటీ అడ్వకేట్ జనరల్ను పక్కకు తప్పించి ఖట్టర్ సర్కార్. డేరా అభిమానులు గుమిగూడటంపై నిషేధం విధించనందుకు మరో సీనియర్ పోలీసు అధికారి - డీసీపీ అశోక్ కుమార్పై సస్పెన్షన్ వేటు విధించింది. డీసీపీని సస్పెండ్ చేయడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ రాజకీయ నిర్ణయాల వల్లే అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు అచేతనంగా తయారయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖట్టర్ రాజకీయంగా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది. ఇటీవల డేరా సంస్థకు హర్యానా విద్యాశాఖ మంత్రి రాం బిలాస్ శర్మకు రూ.51 లక్షల గ్రాంట్ మంజూరుచేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది.
హిస్సార్లో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను అడ్డుకున్న సౌదా అనుచరులు
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో తిష్ట వేసిన డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రంలో ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారని ఆర్మీ ఇంటెలిజెన్స్ 2010 డిసెంబర్లోనే హెచ్చరించింది. అవాంఛనీయ పరిస్థితులను సరిదిద్దాలంటే డేరా కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జస్టిస్ ఎం జయాపౌల్ సూచించారు. మాజీ సైనికులు ఈ శిక్షణ అందించారని, డేరాలోకి వెళ్లొద్దని సైన్యానికి సలహా ఇచ్చింది. రైఫిళ్లు, పిస్టళ్లు తదితర ఆయుధాలను వాడుతున్నారన్న విషయమై ఎటువంటి ఆధారాలు మాత్రం పోలీసులు సంపాదించలేకపోయారు. ఆయుధాల వినియోగం అంశం 2014 చివరిలో మరోసారి చర్చకు వచ్చింది.
కోర్టు ధిక్కార కేసులో హిస్సార్లోని సత్లోక్ ఆశ్రమంలో తనను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు గుర్మీత్, ఆయన సహచరులు అడ్డుకున్నప్పుడు ఈ సంగతి బయటపడింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించారు. దీన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సత్లోక్ ఆశ్రమంలో ఆయుధాల వినియోగ శిక్షణపై దర్యాప్తు చేయాల్సిందిగా 2014 డిసెంబర్ నాలుగో తేదీన ఆదేశాలు జారీచేసింది. నాడు ఈ కేసులో అమికస్ క్యూరీగా అనుపం గుప్తాను నియమించింది. కానీ డేరా సచ్చా సౌదాలో ఆయుధాలు లేవని,, ఆయుధ వినియోగంపై శిక్షణ ఇవ్వలేదని 2015లో హైకోర్టుకు హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హర్యానా అడ్వకేట్ జనరల్ బాల్దేవ్ రాజ్ మహాజన్ మాత్రం.. ఆర్మీ హెచ్చరిక చాలా పాతకాలం నాటిదని దాటేశారు. గత ప్రభుత్వం కూడా డేరా సచ్చా సౌదాలో ఎటువంటి అనుమానాస్పద వ్యవహారాలు జరుగుతున్నట్లు గుర్తించలేదని సెలవిచ్చారు.