నాకు, విజయశాంతికి ప్రాణహాని: పన్నీరు వర్గంపై సరస్వతి ఫిర్యాదు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, శశికళ వర్గం నాయకురాలు సరస్వతి ఆరోపించారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, శశికళ వర్గం నాయకురాలు సరస్వతి ఆరోపించారు. తనతోపాటు ప్రముఖ సినీ నటి విజయశాంతిలకు కూడా ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ మేరకు చెన్నై నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా మద్దతు తెలపవచ్చని, అలాగే తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ వైపు నిలిచానని తెలిపారు. దీంతో తన మొబైల్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సరస్వతి తెలిపారు. ఇవన్నీ కూడా విదేశాల నుంచి చేస్తున్నారని చెప్పారు.
ఇలాంటివే మాజీ మంత్రులు వలార్మతి, గోకుల ఇందిర, సినీ నటి విజయశాంతిలకు కూడా బెదిరింపు ఫోన్లు వస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి వెనుక పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ఐటీ విభాగం మాజీ ఆఫీస్ బేరర్ రామచంద్రన్ల హస్తం ఉన్నట్లు ఆమె ఆరోపించారు.
సత్వర విచారణ జరిపి బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారనే నమ్మకం పోలీసులపై ఉందని సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే శశికళకు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబసభ్యులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించిన విషయం తెలిసిందే.