Liger: తొక్కిసలాట: ఊపిరాడక సొమ్మసిల్లి: మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ
ముంబై: మచ్ అవైటెడ్ సినిమా.. లైగర్. విజయ్ దేవరకొండ-అనన్య పాండే హీరో హీరోయిన్లు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ఇది. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయకానుందీ మూవీ. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జొహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ప్రమోషన్లతో బిజీ..
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో యూనిట్ నిమగ్నమై ఉంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో సినిమాను ప్రమోట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే స్వయంగా ఇందులో పాల్గొంటోన్నారు. ప్రేక్షకులను కలుస్తోన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మూవీ ప్రమోషన్ పూర్తయింది. బెంగళూరు, చెన్నై, కోచిల్లో దశలవారీగా దీన్ని చేపట్టనుంది యూనిట్. ఈ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు విజయ్ దేవరకొండ.
అపశృతి..
ముంబైలో నిర్వహించిన ప్రమోషన్లో అపశృతి చోటు చేసుకుంది. ముంబైలోని ఓ మాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. విజయ్ దేవరకొండ-అనన్య పాండేను చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అంచనాలకు మించిన సంఖ్యలో గుమికూడారు. అనన్య పాండేతో కలిసి విజయ్ దేవరకొండ స్టేజ్ మీదికి చేరుకోగానే ప్రేక్షకులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
తొక్కిసలాట..
దీనితో తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమానులందరూ స్టేజీ వద్దకు దూసుకుని రావడానికి ప్రయత్నించారు. దీనితో ముందువరుసలో ఉన్న వారు కిందపడ్డారు. తొక్కిసలాట సంభవించింది. కొందరు అభిమానులు సొమ్మసిల్లిపోయారు. వారిని బయటికి తీసుకుని రావడానికి బౌన్సర్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. వెనుక వైపు ఉన్న అభిమానులు తోసుకోవడంతో ముందువరుసలో ఉన్న వారు కిందపడ్డారు. స్టేజీ ఎదురుగా కట్టిన బ్యారికేడ్లల్లో చిక్కుకుపోయారు.
అర్ధాంతరంగా..
నిర్వాహకులు పదేపదే మైక్లల్లో హెచ్చరించినప్పటికీ.. ఈ తోపులాట మాత్రం ఆగలేదు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే కూడా అభిమానులకు సూచనలు చేశారు గానీ అప్పటికే తొక్కిసలాట మొదలైంది. దీనితో ఈ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు నిర్వాహకులు. విజయ్ దేవరకొండ-అనన్యపాండే స్టేజ్ దిగి బయటికి వెళ్లిపోయారు. తొక్కిసలాటను సకాలంలో అక్కడి సిబ్బంది నివారించగలిగారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
థ్యాంక్స్ చెబుతూ..
ఈ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా రద్దు చేసిన తరువాత విజయ్ దేవరకొండ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కొంత సమాచారాన్ని పోస్ట్ చేశాడు. ప్రేక్షకుల ప్రేమ తన హృదయానికి తాకిందని, ఇంతటి ఆదరాభిమానాన్ని ఊహించలేదని పేర్కొన్నాడు. మాల్లో నిర్వహించిన ప్రమోషన్కు వచ్చిన అభిమానులందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అందరూ సురక్షితంగా ఉండాలని ఈ నెల 25వ తేదీన థియేటర్లల్లో కలుద్దామని అన్నాడు.