మిజోరాం రాష్ట్రాన్ని డిసైడ్ చేయనున్న మద్యపాన నిషేధం అంశం
సాధారణంగా ఎన్నికలు జరిగే సమయంలో నాయకులు హామీలు ఇస్తూ ఉంటారు. మరి ఆ హామీలు హామీల్లాగే మిగిలిపోతాయి తప్ప ఎన్నికలు జరగిన తర్వాత ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకునే నాథుడే కనిపించడు. అయితే ఈ సారి ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలున్న మిజోరాం రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ మద్య పాన నిషేధంపై సీరియస్గా ఆలోచిస్తున్నాయి. మద్యపానంను సంపూర్ణంగా నిషేధిద్దామా లేక విడతల వారీగా నిషేధం అమల్లోకి తీసుకొద్దామా అని తర్జన భర్జన పడుతున్నాయి.

మద్యపానం చుట్టూ మిజోరాం రాజకీయాలు
మిజోరాం రాష్ట్రంలో ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. క్రైస్తవులు అత్యధికంగా ఉండే ఈ ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఈ రాష్ట్రంలో మొత్తం జనాభా 10 లక్షలు. అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష మిజోరాం నేషనల్ పార్టీ. మిజోరాం పూర్తి స్థాయిలో అంటే 1987లో ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడ కాంగ్రెస్, మిజోరాం నేషనల్ పార్టీలే పాలించాయి. ఇప్పుడు ఈ ఈశాన్య రాష్ట్రంలో కూడా తన సత్తా చాటుకోవాలని భావిస్తోంది బీజేపీ.

సంపూర్ణ మద్యపానం నిషేధానికి మిజోరాం నేషనల్ పార్టీ మద్దతు
మిజోరాం రాష్ట్రంలో మద్యపానం ప్రధాన సమస్యగా మారింది. దీనిపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ మద్యపాన నిషేదాన్ని వ్యతిరేకిస్తుండగా... మిజోరాం నేషనల్ పార్టీ మాత్రం సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ స్టాండ్ మాత్రం మరోలా ఉంది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై నిషేధం విధించాలని స్థానికంగా రాష్ట్రంలో తయారయ్యే మద్యం పానంను ప్రోత్సహించాలని చెబుతోంది. మద్యం అనేది ఒక వ్యాధి అని, వ్యసనమని... దీంతో ఎన్నో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య పానం నిషేధం విధిస్తామని ఎమ్ఎన్ఎఫ్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జోరంతంగా చెప్పారు.

చర్చీల్లో మద్యపానం పై పెద్ద ఎత్తున నిరసనలు
ప్రస్తుతం ఉన్న మిజోరాం రాష్ట్ర సీఎం లాల్తాన్హావ్లా తాను మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ చట్టం చేశారు. 20 ఫిబ్రవరి 1997 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 2007లో నాటి సీఎంగా ఉన్న జోరంతంగ జామకాయలు, ద్రాక్షాల నుంచి వైన్ తయారు చేసుకోవచ్చని చెబుతూ ఇతర మద్యంపై నిషేధం విధించారు. ఇక తాన్హావ్లా ఐదో సారి సీఎం అయ్యాక 10 జూలై 2014లో నిషేధాన్ని రద్దు చేశారు. మద్యపానం నిషేదం రద్దు చేయడంతో తిరిగి మద్యంపై నిషేధం తీసుకురావాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.

మద్యపానంపై ప్రతిపక్ష పార్టీది అనవసర రాద్దాంతం: కాంగ్రెస్
సెప్టెంబర్లో సామాజిక ఆర్థిక సర్వే రాష్ట్రంలో జరిగిన సమయంలో మద్య పానం అనేది చాలా చిన్న సమస్యగా తేలిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి లల్లియన్ చుంగా చెప్పారు. ఈ అంశాన్ని మిజోరాం నేషనల్ పార్టీ పెద్ద విషయంగా చేసే చూపుతోందని చెప్పారు. ఈ క్రమంలో ఆ పార్టీ ఎంతవరకు విజయం సాధించిందో తనకు తెలియదని కాంగ్రెస్ పేర్కొంది. కేవలం మద్యం అంశంతోనే ఎమ్ఎన్ఎఫ్ లబ్ది పొందాలని చూస్తోందని ప్రజలు వారికి గట్టి గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉంటే యువత సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని వ్యతిరేకిస్తుండగా... ఎంఎన్ఎఫ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీలు సంపూర్ణ మద్యపానం నిషేధం విధించాలని కోరుతున్నాయని అక్కడి సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. మరోవైపు మద్యం అనేది చాలా చిన్న అంశమని రాజకీయ పార్టీలు మద్యం గురించి కేవలం ఎన్నికల సమయంలోనే మాట్లాడుతాయని ఓ రెస్టారెంట్ యజమాని చెప్పారు.












Click it and Unblock the Notifications