ఎన్నికలు: బిజెపితో పొత్తు దిశగా రాంవిలాస్ అడుగులు
పాట్నా: ఎల్జెపి అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ రాబాయే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై అభిమానం ఉంచిన బీహార్ ప్రజలు అత్యధికంగా 40 లోక్సభ్ స్థానాలను ఆ పార్టీకి కట్టబెట్టే అవకాశాలున్నాయని ఇటీవల విడుదలైన పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంవిలాస్ పాశ్వాన్ బిజెపితో పొత్తు కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం రాంవిలాస్ పాశ్వాన్ తన అనుచర గణంతో మాట్లాడుతూ.. బిజెపితో ఎల్జెపి పొత్తు ఖరారైనట్లు ప్రకటించినట్లు సమాచారం. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ మాత్రం బిజెపి, ఎల్జెపి పొత్తును అంగీకరించడం లేదు. ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు పాశ్వాన్ తీసుకుంటారని ఆయన తెలిపారు. కాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో పోటీ చేసే అవకాశాలున్నాయి.
బిజెపి వర్గాల ప్రకారం.. బిజెపి ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ కేంద్రమంత్రి షానవాజ్ హుస్సేన్లు ఎల్జెపితో పొత్తుపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ పొత్తు పెట్టుకుంటే ఏడు స్థానాలను కేటాయించగలమని వారు ఎల్జెపికి తేల్చి చెప్పినట్లు సమాచారం. మొదట 12 సీట్లు డిమాండ్ చేసిన ఎల్జెపి, ఆ తర్వాత 8 నుంచి 9 స్థానాలు కేటాయిస్తే చాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
యూపిఏ-1 హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన ఎల్జెపి అధినేత రాంవిలాస్ పాశ్వాన్ ప్రస్తుత యూపిఏ పాలనపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి తమకు సరైన సీట్లు కేటాయిస్తే బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాంవిలాస్ పాశ్వాన్ త్వరలోనే బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీలను కలిసి పొత్తుపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా లాలూ ప్రసాద్ యాదవ్ ఎల్జెపి నేత అయిన రాంకృపాల్ యాదవ్తో పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 15, ఎల్జెపికి 5, ఎన్సిపికి రెండు స్థానాలు కేటాయించేందుకు లాలూ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఎల్జెపి 9 స్థానాలు డిమాండ్ చేసినట్లయితే తమ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని లాలూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.