‘‘అవును.. బాబ్రీ మసీదును నేనే కూల్చమన్నా, అద్వానీకి సంబంధం లేదు’’
బాబ్రీ మసీదును కూల్చేందుకు కరసేవకులను ప్రేరేపించినది తానేనని, అద్వానీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి మరోసారి స్పష్టం చేశారు.
లక్నో : బాబ్రీ మసీదును కూల్చేందుకు కరసేవకులను ప్రేరేపించినది తానేనని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి మరోసారి స్పష్టం చేశారు. తనతో పాటు లక్షలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చారన్నారు.
రాముడి కోసం తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, ఉరిశిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమని, కానీ అబద్ధాలు మాత్రం చెప్పబోనని అన్నారు. రామ మందిరం నిర్మాణం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో వేదాంతి సహా మరో 12 మంది నిందితులుగా ఉన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజమాత విజయరాజె సింధియాల మీద మోపిన ఆరోపణలన్నీ అవాస్తవమని వేదాంతి చెబుతున్నారు.
అక్కడ మసీదు ఎప్పుడూ లేదని, కేవలం శిథిల స్థితిలో ఓ నిర్మాణం మాత్రమే ఉండేదని.. దాన్ని మాత్రమే తాము కూల్చామని ఆయన తెలిపారు. 1992లో భారీ సంఖ్యలో వచ్చిన కరసేవకులు బాబ్రీమసీదును కూల్చిన ఘటనతో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం నాడు రామ్ విలాస్ వేదాంతి చెప్పిన సంగతి తెలిసిందే.
అద్వానీ, జోషి, ఉమాభారతి లాంటివాళ్లంతా నిర్దోషులని, కూల్చివేత వెనుక కుట్ర అంటూ ఏమీ లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కూడా అన్నారు. ఇక సుప్రీంకోర్టులో కేసు ఒక సర్వసాధారణ తతంగం మాత్రమేనని, విచారణ పూర్తయిన తర్వాత బీజేపీ అగ్రనాయకులంతా నిర్దోషులుగా బయటపడటం ఖాయమని చెప్పారు. తమమీద పన్నిన కుట్రలన్నీ విఫలమయ్యాయని ఆరోజు వారు గర్వంగా చెప్పుకొంటారని ధీమా వ్యక్తం చేశారు.