టీ బిల్లుపై సహకరించం: బాంబు పేల్చిన అద్వానీ
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్న వైఖరిపై బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లు విషయంలో తమను దోషులుగా నిలబెట్టే ప్రయత్నానికి కాంగ్రెసు ఒడిగట్టిందనే అభిప్రాయాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణ నేతలు మంగళవారం అద్వానీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ తెలంగాణపై కాంగ్రెసు వైఖరిపై మండిపడినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బిల్లుకు సహకరించేది లేదని అద్వానీ వారితో చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని, తమను అప్రతిష్ట పాలు చేసేందుకు ఎత్తుగడ వేసిందని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. బిల్లులో చాలా న్యాయపరమైన చిక్కులున్నాయని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తాను 1970 నుంచి పార్లమెంటులో ఉన్నానని, ఇంత దారుణమైన స్థితి పార్లమెంటులో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.
కాంగ్రెసుకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదని, నెపాన్ని తమపైకి నెట్టేందుకు కాంగ్రెసు ప్రయత్నిస్తోందని బిజెపి నేత అరుణ్ జైట్లీ తమతో అన్నట్లు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో చెప్పారు. ఈ పరిస్థితిలో తాము బిల్లుకు మద్దతు ఇవ్వలేమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తామని అద్వానీ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని తాము అద్వానీని కోరినట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అయితే, బిల్లుకు మద్దతు తెలిపేందుకు తన మనసు అంగీకరించడం లేదని, తెలంగాణకు మద్దతు ఇస్తామని తాము ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నామని అద్వానీ అన్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
కాంగ్రెసు తీరుపై బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు కూడా తీవ్రంగా మండిపడ్డారు. న్యాయశాఖ చెప్పే వరకు బిల్లు ఏదనేది ప్రభుత్వానికి తెలియలేదా అని ఆయన అడిగారు. ఇప్పటికైనా బిల్లును లోకసభలో పెడతారనే నమ్మకం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీయే బిల్లు పెడుతుంది, కాంగ్రెసు పార్టీవారే వ్యతిరేకిస్తారు అని విమర్శించారు.
తెలంగాణ విషయంలో తమ నిజాయితీని శంకించే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ తనను తాను చక్కదిద్దుకోకుండా తమ పార్టీపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. బిల్లు ఆమోదం పొందకపోతే నెపం తమపై నెట్టేందుకు కాంగ్రెసు వ్యూహం రచించిదని ఆయన అన్నారు. ముందు కాంగ్రెసు తన మంత్రులను, ఎంపీలను క్రమపద్ధతిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు.
కాంగ్రెసు పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న సీమాంధ్ర ఎంపీలను ఇప్పటి వరకు ఎందుకు బహిష్కరించలేదని ఆయన అడిగారు. కాంగ్రెసు ఆడుతున్న నాటకంలో భాగంగానే ఆరుగురు పార్లమెంటు సభ్యులపై ఇప్పుడు వేటు వేశారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు తమ పార్టీ ఎప్పుడూ అనుకాలమేనని ఆయన చెప్పారు. అయితే, సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.