లాక్డౌన్లో నెలరోజులకు పైగా: మళ్లీ పొడిగింపు: ఆరున్నర వేలకు క్షీణించిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్డౌన్ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది అయిదోసారి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మరోసారి వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించింది. ఈ నెల 24వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేస్తోన్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చిన మూడోవారం నుంచి ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఇదివరకటితో పోల్చుకుంటే- పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ఇంతకుముందు 35 శాతం మేర రికార్డవుతూ వచ్చిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ రేటు..తొలుత 23 శాతానికి తగ్గింది. అక్కడి నుంచి మళ్లీ 11 శాతానికి దిగజారింది. ఢిల్లీ వైద్యాధికారులు శనివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. అక్కడ నమోదైన కొత్త కేసులు 6,500 మాత్రమే. అంతకుముందు రోజు అంటే.. శుక్రవారం కూడా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 8,500.
సంపూర్ణ లాక్డౌన్ విధించక ముందు 25 నుంచి 30 వేల వరకు రోజువారీ కొత్త కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆ సంఖ్య 6,500కు క్షీణించింది. దీన్ని మరింత తగ్గించే ఉద్దేశంతో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించినట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ కేసులు మళ్లీ పెరగకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇదివరకు తొలిసారిగా కిందటి నెల 19వ తేదీన ఢిల్లీలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. 10 గంటల నుంచి 26వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉండేలా తొలి లాక్డౌన్ను విధించారు.
రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో దాన్ని మరో వారం రోజుల పాటు పొడిగించారు. అయినప్పటికీ- పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. మళ్లీ 10వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేశారు. మూడోసారి పొడిగించిన లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటులో 23 శాతం మేర క్షీణత కనిపించింది. లాక్డౌన్ను పొడిగించడం వల్ల మరింత తగ్గుదల కనిపిస్తుందనే ఉద్దేశంతో ఇంకోసారి లాక్డౌన్ పొడిగించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. తాజా పొడిగింపుతో నెల రోజుల పాటు లాక్డౌన్ ఉన్న తొలి రాష్ట్రమౌతుంది ఢిల్లీ.