లాక్డౌన్ అమల్లో ఉన్నా.. వందలాదిగా భక్తులు పాల్గొని రథం లాగారు!
బెంగళూరు: కర్ణాటకలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. అయితే, ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
కలబురగి జిల్లాలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను లెక్కచేయకుండా ప్రజలు ఒక మత సంబంధమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వందలాది సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు.

ఇక సామాజిక దూరం అనే పదానికి అక్కడ ఊసేలేకుండా పోయింది. వందలాది మంది సిద్ధలింగేశ్వర రథాన్ని లాగుతూ కనిపించారు. కలబురిగి జిల్లాలోని చిత్తపూర్ తాలూకాలో ఈ వేడుక జరిగింది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు.
కాగా, మార్చి నెలలో కలబురిగిలోనే దేశంలో తొలి కరోనా మరణం సంభవించడం గమనార్హం. కర్ణాటకలో గురువారం నాటికి మొత్తం 315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనాతో మరణించగా.. 82 మంది కోలుకున్నారు. ఏప్రిల్ 10న బీజేపీ ఎమ్మెల్యే జయరాం తన పుట్టినరోజున వేడుకలను జరుపుకోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.
ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తులకు కరోనా సోకడం, వారు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో అక్కడున్నవారికి కూడా వ్యాధి వ్యాపించిన విషయం తెలిసిందే. ఇక, భారతదేశంలో ఇప్పటి వరకు కరోనావైరస్ పాజిటివ్ కేసులు 12,759 నమోదు కాగా, 420 మంది ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications