అబ్ కీ బార్ 400కు పైగా: లోకసభ ఎన్నికలకు బీజేపీ సరికొత్త నినాదం
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సరికొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది. 2014 ఎన్నికల్లో మూడు వందలకు పైగా సీట్లు నినాదంతో వెళ్లింది. ఇప్పుడు 'ఈసారి 400 పైగా' అనే నినాదంతో ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు ఆ పార్టీ తమ కొత్త నినాదాన్ని విడుదల చేసింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 280కి పైగా సీట్లు గెలుచుకుంది. ఆయా రాష్ట్రాల్లో పలు పార్టీలతో కలిసి ఎన్డీయేగా ఏర్పడి పోటీ చేసింది. కానీ బీజేపీకి ఒక్క పార్టీకే మెజార్టీ కంటే పది సీట్లు ఎక్కువే వచ్చాయి. మొత్తం ఎన్డీయే కూటమి 330కి పైగా సీట్లు సాధించింది.
కాంగ్రెస్ పార్టీ దారుణంగా పడిపోయింది. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే 80 స్థానాలకు గాను 73 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి అక్కడ బీజేపీకి దెబ్బపడేలా ఉంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు తదితర చోట్ల బీజేపీకి అనుకూలంగా ఉంది. పలు ప్రీపోల్ సర్వేలు గతంలో కంటే బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఈసారి 400 కంటే పైన అనే నినాదంతో వెళ్తుండటం గమనార్హం.
బీజేపీకి దక్షిణాదిన అంతగా పట్టు లేదు. అలాంటప్పుడు 400కు పైగా సీట్లు అంటే కష్టమేనని అంటున్నారు. బీజేపీ మాత్రం తమకు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సరికొత్త నినాదంతో ముందుకు సాగుతోంది.