పనిచేసింది 21 గంటలే,లొల్లి వల్లే లోక్సభ సమాప్తి -విపక్షాలపై స్పీకర్ గుస్సా-వచ్చే ఆగస్టు 15కు కొత్త పార్లమెంటు
ఓ వైపు కరోనా విలయ తాండవం, లాక్ డౌన్ ల దెబ్బ నుంచి ఇంకా కోలుకోని ఆర్థికం, ఆపై అధిక ధరల భారం, పెట్రో వడ్డన, మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం, ఇవి చాలదన్నట్లు దేశంలోని ప్రముఖులపై కేంద్ర ప్రభుత్వమే నిఘా కుట్రకు పాల్పడిందనే పెగాసస్ ఉదంతం.. ఇన్ని అంశాలన నడుమ ఆసక్తికరంగా నడుస్తాయనుకున్న పార్లమెంట్ సమావేశాలు కాస్తా, దాదాపు పని చేయకుండానే ముగిసిపోయాయి. సభ జరిగిన తీరుపై అధికార, విపక్ష సభ్యుల విమర్శలు, సభాపతుల నుంచి అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. వివరాలివి...

లోక్సభ పనిచేసింది 21 గంటలే
పలు అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు లొల్లికి దిగడం, పొడవూతా సభా కలాపాలకు అడ్డుతగులుతోన్న నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందస్తుగానే ముగిశాయి. బుధవారం నాడు లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ జరగాల్సి ఉండగా.. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా రెండురోజుల ముందే ముగించారు. ఈ సమావేశాల్లో లోక్సభ కేవలం 22శాతం ప్రొడక్టివిటీతో మొత్తంగా 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. విపక్షాల నిరసనల కారణంగా 74 గంటలు వృథా అయ్యాయి.

కుదిపేసిన పెగాసస్
వర్షాకాల సమావేశాల్లో భాగంగా జూన్ 19న లోక్ సభ ప్రారంభమైంది. అయితే, సభ ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు పెగాసస్ నిఘా కుట్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశంలో విపక్ష నేతలు సహా పలు రంగాల ప్రముఖుల ఫోన్లను పెగాసస్ స్పైవేర్ ద్వారా కేంద్రమే హ్యాకింగ్ చేయించిదన్న ఆ ఉదంతం మొత్తం వర్షాకాల సమావేశాలను కుదిపేసింది. పెగాసస్ పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు మొదటి రోజు నుంచే ఆందోళనలకు దిగారు. దీంతో సభలో వాయిదా పర్వం నడిచింది. ఈ సమావేశాల్లో లోక్సభ మొత్తంగా 17 సార్లు సమావేశమైంది. ఇందులో మొత్తం 96 పనిగంటలు ఉండగా.. లోక్సభ కేవలం 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. విపక్షాల ఆందోళనలతో 74 గంటల 46 నిమిషాలు వృథాగా పోయాయి. కాగా,

స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి..
లోక్సభ వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరిగిన తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సెషన్లో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు జరగకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సభలో గరిష్ఠ స్థాయిలో కార్యకలాపాలు జరిగేవిధంగా, ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరిగే విధంగా తాను ఎల్లప్పుడూ కృషి చేశానని చెప్పారు. ఈ సెషన్లో సభా కార్యకలాపాలకు నిరంతరం అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. గత రెండేళ్ళలో ప్రయోజనకరంగా సభ నడిచిందన్నారు. సభలో చర్చలు, అంగీకారాలు, అంగీకరించకపోవడాలూ ఉంటాయని, సభ గౌరవాన్ని ఎన్నడూ తగ్గించలేదని అన్నారు. సభ గౌరవాన్ని ఎంపీలు కాపాడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా సభా కార్యకలాపాలు సాగే విధంగా సహకరించాలని అందరు ఎంపీలను కోరారు. సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. నినాదాలు చేయడం, బ్యానర్లను ప్రదర్శించడం మన పార్లమెంటరీ సంప్రదాయాలు కాదన్నారు. ఎంపీలు తమ తమ స్థానాల్లో ఉంటూ తమ భావాలను వ్యక్తం చేయాలన్నారు. అంతేకాదు,

మొత్తం 20 బిల్లులకు ఆమోదం..
సభలో విపక్షాల నిరసనల నడమే కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 20 బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయి. వీటిలో ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్, జనరల్ ఇన్సూరెన్స్, కొబ్బరి బోర్డు, పన్ను చట్టాలు, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ, ఓబీసీలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. ఇందులో కీలక 127వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉంది. దాదాపు అన్ని బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలో ఆమోదం పొందాయి. ఒక్క రాజ్యాంగ సవరణ బిల్లు సమయంలో మాత్రం విపక్షాలు ఆందోళనలకు విరామమిచ్చాయి. దీంతో సభలో చర్చ జరగడంతో పాటు ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సభా కార్యకలాపాలకు సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, అన్ని పార్టీల నేతలకు స్పీకర్ ఓం బిర్లా ధన్యవాదాలు తెలిపారు.

వచ్చే ఆగస్టు 15కు కొత్త పార్లమెంట్
లోక్ సభను నిరవధిక వాయిదా వేసి, విపక్షాలపై మండిపడ్డ స్పీకర్ ఓం బిర్లా ఓ శుభవార్త తెలిపారు. వచ్చే ఏడాది(2022) ఆగస్ట్ 15 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్యం లభించి 75 ఏండ్లు పూర్తయ్యే సందర్భంలో నూతన పార్లమెంట్ భవనం సిద్ధం కానుందని, 2022 ఆగస్ఠ్ నాటికి నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ముగిసేలా చర్యలు చేపడుతున్నామని స్పీకర్ చెప్పారు. ఇదిలా ఉంటే, లోక్ సభ నిరవధిక వాయిదా పడినప్పటికీ, రాజ్యసభలో మాత్రం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే రాజ్యసభ ఆగస్టు 13న నిరవధిక వాయిదా పడే అవకాశముంది. మంగళవారం నాడు రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం, కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం వంటి చర్యలతో సభ పవిత్రత దెబ్బతిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అన్న వెంకయ్య కన్నీరు పెట్టారు.












Click it and Unblock the Notifications