లోకాయుక్త జడ్జికి కత్తిపోట్లు, సీసీబీ ఎంట్రీ, రాజస్థాన్ వ్యక్తి, దాడికి అదే కారణం, కమిషనర్!
బెంగళూరు: లోకాయుక్త న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద కత్తితో దాడి చేసిన కేసును సీసీబీకి అప్పగించామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టి. సునీల్ కుమార్ అన్నారు. లోకాయుక్త కార్యాలయంలోనే న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద హత్యాయత్నం జరగడంతో కేసు సీసీబీతో విచరాణ చేయించి పూర్తి సమాచారం సేకరించాలని నిర్ణయం తీసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టి. సునీల్ కుమార్ మీడియాకు చెప్పారు. హత్యయత్నం చేసిన వ్యక్తి సొంత రాష్ట్రం రాజస్థాన్ అని సునీల్ కుమార్ వివరించారు.
రాజస్థాన్ టూ కర్ణాటక
రాజస్థాన్ నుంచి కర్ణాటక చేరుకున్న తేజ్ రాజ్ శర్మా (33) తుమకూరు జిల్లా తిపటూరులో నివాసం ఉంటున్నాడు. తేజ్ రాజ్ శర్మా పక్కా స్కెచ్ వేసుకుని బెంగళూరులోని లోకాయుక్త కార్యాలయానికి వచ్చాడని పోలీసు కమిషన్ టి. సునీల్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. లోకాయుక్త కార్యాలయంలో భద్రతా లోపాలు ఉన్నాయని ఆరోపణలను సిటీ పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ ఖండిచారు.
సీసీబీ డీసీపీ జితేంద్ర
బెంగళూరు లోకాయుక్త కార్యాలయంలో భద్రతా లోపాలు ఉన్నాయనే ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీసీబీ డీసీపీ జితేంద్ర కణగనికి ఆదేశాలు జారీ చేశామని, న్యాయమూర్తి విషయంలో నిర్లక్షం చేశారు అని వెలుగు చూస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ హెచ్చరించారు.
జడ్జి మీద అందుకే కోపం
నిందితుడు తేజ్ రాజ్ శర్మా ప్రభుత్వ అధికారుల మీద లోకాయుక్తలో అనేక కేసులు వేశాడని, అయితే అతను సరైన సాక్షాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించడంలో విఫలం అయ్యాడని, చాల కేసులు కొట్టి వేశారని, అదే కోపంతో న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద కత్తితో దాడి చేసి ఉంటాడని సునీల్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసు కస్టడీ
నిందితుడు తేజ్ రాజ్ శర్మాని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ అన్నారు. విచారణ పూర్తి అయితే అసలు విషయాలు వెలుగు చూస్తాయని నగర పోలీసు కమిషన్ సునీల్ కుమార్ చెప్పారు.
తుమకూరులో తేజ్ రాజ్
గురువారం నిందితుడు తేజ్ రాజ్ శర్మాను తుమకూరు, తిపటూరు ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి చికిత్స పొందుతున్న మాల్యా ఆసుపత్రి దగ్గర గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి విశ్వనాథ్ శెట్టి మీద హత్యాయత్నం జరిగిన కేసులో తేజ్ రాజ్ శర్మా వెనుక ఎవరైనా ఉన్నారా ? అంటూ సీసీబీ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.