పక్కనే కూతురు: భుజంపై భార్య శవంతో 10 కిమీ నడిచిన గిరిజనుడు
భువనేశ్వర్: తాళి కట్టిన భార్య అనారోగ్యంతో అర్ధాంతరంగా కన్ను మూయడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు డబ్బుల్లేక, భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచాడో భర్త. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈ హృదయ విదారక ఘటన దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా పిలువబడుతోన్న ఒడిశాలో జరిగింది. ఆ సమయంలో తన వెంట 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. వివరాల్లోకి వెళితే మేఘారా అనే గ్రామంలో దనమాజీ(42), అమాంగ్ దేయి అనే గిరిజన దంపతులున్నారు.
ఈ దంపతులకు 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో అమాంగ్కు వ్యాధి ముదరడంతో చికిత్స కోసం గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలహండి అనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో ఏ ఒక్కరూ అతనికి సహకరించలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మహాపారాయణ' అనే పథకం ప్రారంభించారు.
దీని ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం. కానీ దనమాజీ భార్యను తరలించేందుకు మాత్రం ఆస్పత్రి వర్గాలు సహకరించలేదు. దీంతో ఆమె మృతదేహాన్నిబట్టల్లో చుట్టి, తన గ్రామానికి కాలినడకన కూతురితో సహా బయల్దేరాడు.
అలా అతడు 10 కిలోమీటర్లు నడిచి వెళ్లిన అనంతరం ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ మిగతా 50 కిలోమీటర్లకు ఆంబులెన్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్య పూరితం గా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.