కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు: స్టాలిన్, ఇంట్లోనే చికిత్స, పరామర్శించిన పన్నీరుసెల్వం
Recommended Video
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఆరోగ్యంపై రాష్ట్రంలో వదంతులు చెలరేగుతున్నాయి. కరుణానిధి జ్వరంతో బాధపడుతుండగా, ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కరుణానిధి కుమారుడు, డీఎంకే నేత స్టాలిన్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. కరుణానిధి అనారోగ్యంగా ఉన్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధమని, ఆయన బాగున్నారని స్టాలిన్ తెలిపారు. వదంతులను నమ్మవద్దని చెప్పారు. వైద్యుల సలహా మేరకు ఆయన మరికొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వుందని, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు.
కార్యకర్తలు, పార్టీ నేతలు ఎవరూ గోపాలపురం (కరుణానిధి ఇంటి ప్రాంతం) రావద్దని సూచించారు. ఆయన కేవలం స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన కుటుంబ వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.
కరుణానిధి జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు హెల్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, పలువురు మంత్రులు, రాజకీయ నేతలు కరుణానిధిని పరామర్శించారు.