'జయలలిత వారసుడు ఇతనే': ఆ సెంటిమెంట్పై స్టాలిన్ గెలుపు ఆశ
జయలలిత రాజకీయ వారసత్వానికి అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు మధుసూదనన్ అర్హుడని మాజీ మంత్రి కె పాండ్యరాజన్ గురువారం అభిప్రాయపడ్డారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో మధుసూదనన్ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు.
చెన్నై: జయలలిత రాజకీయ వారసత్వానికి అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు మధుసూదనన్ అర్హుడని మాజీ మంత్రి కె పాండ్యరాజన్ గురువారం అభిప్రాయపడ్డారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో మధుసూదనన్ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు.
అమ్మ మృతిపై విచారణ కమిషన్ వేయాలనే డిమాండ్ ప్రధాన అంశంగా ప్రచారానికి వెళతామని పాండ్యరాజన్ పేర్కొన్నారు. జయలలిత ఆస్తులను ప్రభుత్వం, పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలను బయటపెట్టే సమర్థుడు మధుసూదనన్ అని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు.
అన్నాడీఎంకే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తర్వాత అన్నాడీఎంకే నాయకత్వంలో వర్గపోరు తీవ్రమైంది. ఈ నేపథ్యంలో శశికళ వర్గం, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు వర్గాలుగా విడిపోయారు.
ఎవరికీ దక్కని రెండాకుల గుర్తు
శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ రెండాకులు గుర్తును ఎన్నికల సంఘం ఎవరికీ కేటాయించలేదు. ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుంది.
వేర్వేరు పార్టీలు
జయలలిత వారసత్వం కోసం పోరాడుతున్న శశికళ, పన్నీరుసెల్వంలకు ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తు రెండు ఆకులు ఇరువురిలో ఎవరికీ దక్కలేదు. అదేవిధంగా ఇరు వర్గాలకు వేర్వేరు పార్టీల పేర్లు వచ్చాయి. అన్నాడీఎంకే ఎన్నికల గుర్తును ఈసీ స్తంభింప చేసింది. శశికళ వర్గానికి టోపీ గుర్తును కేటాయిస్తూ ఆమె పార్టీ పేరును ఏఐఏడీఎంకే అమ్మగాను, పన్నీరు సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభం కేటాయిస్తూ ఏఐఎడీఎంకే పురుచ్చితలైవి అమ్మగా పిలవాలని పేర్కొంది.
అప్పుడు మాదే.. ఇప్పుడూ మాదే గెలుపు
కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం తమదేనని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓసారి ఈసి ఏఐఎడీఎంకే గుర్తును స్తంభించగా తాము గెలిచినట్లు ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. కాగా, దినకరన్, మధుసూదనన్లు ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ వేయనున్నారు.