బలపరీక్ష లేకుండానే: కమల్నాథ్ సర్కార్ను కాపాడిన కరోనా వైరస్: 26 వరకు..!
భోపాల్: మధ్యప్రదేశ్లో పతనం అంచుల్లో కొనసాగుతోన్న కాంగ్రెస్ సర్కార్కు బలపరీక్ష గండం నుంచి గట్టెక్కింది..తాత్కాలికంగా. బలపరీక్ష లేకుండానే శాసనసభ వాయిదా పడింది. ప్రాణాంతక కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని..విశ్వాస పరీక్షను నిర్వహించట్లేదని, సభను 26వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఎన్పీ ప్రజాపతి వెల్లడించారు. దీనితో బలపరీక్ష లేకుండానే సభ వాయిదా పడింది. తన మెడపై మైనారిటీ కత్తి వేలాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కమల్నాథ్ సభను వాయిదా వేయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
అయిదు నిమిషాల్లో గవర్నర్ ప్రసంగం ముగింపు..
మధ్యప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టండన్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయిదే అయిదు నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రసంగ పాఠంలోని తొలి పేజీలోని తొలి రెండు లైన్లు.. చివరి పేజీలోని చివరి రెండు లైన్లను చదివి వినిపంచారు. తన ప్రసంగాన్ని ముగించారు. బలపరీక్షకు అవకాశం ఇవ్వడానికే తాను పూర్తిగా చదవలేకపోయానని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం ముగిసిన నిమిషాల్లోనే..
గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే.. స్పీకర్ ప్రజాపతి సభా వ్యవహారాలను ప్రారంభించారు. వెంటనే కరోనా వైరస్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందని, దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా అనిశ్చితిని సృష్టించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అందుకే బలపరీక్షను నిర్వహించట్లేదని పేర్కొన్నారు. సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సభను వాయిదా వేశారు.

22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో
222 మంది శాసనసభ్యులు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 112 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో కమల్నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. సభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం.. ఆయనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలు పార్టీని వీడటం వంటి పరిణామాల వల్ల కమల్నాథ్ ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది.
అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి..
పది రోజుల పాటు శాసనసభ సమావేశాలు వాయిదా పడటం, దానితో పాటు బలపరీక్షను నిర్వహించడానికి తగిన సమయం లభించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కమల్నాథ్కు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి సమయం లభించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామాల మధ్య మధ్యప్రదేశ్లో పొలిటికల్ హైడ్రామా, క్యాంపు, రిసార్టు రాజకీయాలు మరి కొన్నాళ్ల పాటు కొనసాగడం ఖాయమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications