పండగ వేళ- ముఖ్యమంత్రికి తప్పిన ప్రాణాపాయం
భోపాల్: సంక్రాంతి పండగ వేళ- పెను ముప్పు తప్పింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా మనావర్ టౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అధికార, పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా- ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఫిబ్రవరి-మార్చి నెలల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శివరాజ్ సింగ్ చౌహాన్.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
కంటెంట్ ఉన్న కటౌట్ - నిలబెట్టిందెవరు..?!
ఇందులో భాగంగా- ఇవ్వాళ ఆయన ధార్ జిల్లాలో పర్యటించారు. మనావర్ పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హెలికాప్టర్ లో భోపాల్ నుంచి మనావర్ కు చేరుకున్నారు. సభ అనంతరం భోపాల్ కు తిరుగుముఖం పట్టిన సమయంలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి.
టేకాఫ్ తీసుకుని కొంతదూరం వెళ్లిన తరువాత అవాంఛిత శబ్దం రావడంతో పైలెట్ అప్రమత్తం అయ్యారు. హెలికాప్టర్ ను మళ్లీ మనావర్ కే మళ్లించారు. అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్.. రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. ఆయనకు ప్రాణాపాయం తప్పడంతో అధికార, పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.