యాంటీ లవ్ జిహాదీ చట్టం.. దోషులుగా తేలితే ఐదేళ్లు జైలు.. కీలక వివరాలు వెల్లడించిన హోంమంత్రి..
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'లవ్ జిహాదీ' వ్యతిరేక చట్టం తీసుకురాబోతున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ చట్టం ప్రకారం నాన్-బెయిలబుల్ కేసులు నమోదవుతాయన్నారు. నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 'మధ్యప్రదేశ్ మత స్వేచ్చ బిల్లు-2020' పేరుతో అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. 'లవ్ జిహాదీ'కి వ్యతిరేకంగా చట్టం తీసుకురాబోతున్నట్లు కర్ణాటక,హర్యానా రాష్ట్రాలు ప్రకటించిన కొద్దివారాలకే... ఆ జాబితాలో మధ్యప్రదేశ్ కూడా చేరడం గమనార్హం.
మధ్యప్రదేశ్ యాంటీ లవ్ జిహాదీ చట్టం...
'లవ్ జిహాదీ'కి వ్యతిరేకంగా తీసుకురాబోతున్న చట్టం ద్వారా.. అందుకు సహకరించిన వ్యక్తులను కూడా దోషులుగా నిర్దారించడం జరుగుతుందన్నారు. వారికి కూడా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. వివాహానంతరం మతం మారమని బలవంతపెట్టేవాళ్లు,వేధింపులకు గురిచేసేవాళ్లు కూడా యాంటీ-లవ్ జిహాదీ చట్టం కింద దోషులుగా పరిగణించబడుతారని పేర్కొన్నారు. సాధారణంగా ఎవరైనా వ్యక్తి వివాహానంతరం స్వచ్చందంగా మతం మారాలనుకుంటే... వివాహానికి నెల రోజుల ముందు కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి.
పార్లమెంటులో లవ్ జిహాదీపై కేంద్రం...
ఇదే లవ్ జిహాదీకి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో లవ్ జిహాదీ ఉన్నట్లు ఇప్పటివరకూ ఏ కేంద్ర ఏజెన్సీలు నిర్దారించలేదని పేర్కొంది. అంతేకాదు,ఇప్పుడున్న చట్టాల్లో ఎక్కడా లవ్ జిహాదీ పదమే లేదని చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం... వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి,అనుసరించడానికి స్వేచ్చ ఉందని స్పష్టం చేసింది. కేరళ కాంగ్రెస్ ఎంపీ బెహానన్ బెన్నీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇలా బదులిచ్చారు.
కర్ణాటకతో మొదలు..
ఈ ఏడాది నవంబర్ 6న యాంటీ లవ్ జిహాదీ చట్టంపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఒక ప్రకటన చేశారు. 'లవ్ జిహాద్ అనేది ఒక సామాజిక భూతం. దీనిని అంతంచేసేందుకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు. డబ్బు, ప్రేమ ముసుగులో యవతులకు వల వేసే చర్యలను సహించబోమన్నారు. ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది తెలియదని... కానీ కర్ణాటకలో దీన్ని ఆపాలనుకుంటున్నామని తెలిపారు.
Recommended Video
హర్యానాలోనూ...
యడియూరప్ప ప్రకటన చేసినరోజే హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ కూడా యాంటీ లవ్ జిహాదీ చట్టం తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. మత మార్పిడులను నివారించేలా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పరిశీలించబోతున్నట్లు చెప్పారు.ఈ ఏడాది సెప్టెంబర్లో అలహాబాద్ హైకోర్టు కూడా లవ్ జిహాదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం వివాహం కోసం మతం మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.