లంచం అడిగిన ఎమ్మార్వోకి ఊహించని షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలుసా?
లంచం అడిగిన తహసీల్దార్కు ఓ మహిళ జీవితంలో మరిచిపోలేని షాక్ ఇచ్చింది. లంచం ఇచ్చే స్థోమత తనకు లేదని.. దానికి బదులు తమ గేదెను తీసుకోవాలని.. ఏకంగా దాన్ని వెంటపెట్టుకుని తహసీల్దార్ కార్యాలాయానికి వచ్చింది. దీంతో అక్కడున్న అధికారులు హడలిపోయారు. లంచం ఎవరు అడిగారంటూ రివర్స్లో ఆమె పైనే ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఉన్న నౌధియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నౌధియా గ్రామానికి చెందిన రాంకాలి పటేల్ అనే మహిళ తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీదకి మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. అయితే ఇందుకోసం రూ.10వేలు లంచం సమర్పించాలని అక్కడి అధికారి డిమాండ్ చేశారు.
చేసేది లేక అడిగినంత లంచం ఇచ్చింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె పని కాలేదు. కొద్దిరోజులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాక.. మళ్లీ లంచం ఇవ్వాలంటూ వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ అధికారులకు బుద్ది చెప్పేలా ఏకంగా గేదెను వెంటపెట్టుకుని తహసీల్దార్ కార్యాలాయానికి వెళ్లింది.
లంచం ఇచ్చేందుకు తన వద్ద డబ్బు లేదని,గేదెను తీసుకుని తన పని చేసి పెట్టాలని అభ్యర్థించింది. మహిళ గేదెను వెంటపెట్టుకుని రావడం చూసి అక్కడున్న మిగతా అధికారులు, సామాన్యులు కంగు తిన్నారు. అయితే కొంతమంది కావాలనే ఆమెను తమ పైకి ఉసిగొల్పి కుట్ర పన్నారని ఎమ్మార్వో సిహవల్ ఆరోపించారు.
ఆమెకు సంబంధించిన పనిని గతేడాది నవంబర్ 14వ తేదీనే పూర్తి చేశామని,ఆర్డర్ కాపీ కూడా అందజేశామని చెప్పారు. రెవెన్యూ సైట్లోనూ ఆమె వివరాలు అప్డేట్ చేశామని,అయినప్పటికీ ఆమె కుట్రపూరితంగా తమను బద్నాం చేసేందుకే ఇలా చేసిందని ఆరోపించారు. ఆమెపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని,ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.