శశికళకు ఊరట: మీకు హక్కు లేదు.. పుష్పకు షాకిచ్చిన హైకోర్టు
మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించబడిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు సోమవారం నాడు చుక్కెదురయింది. శశికళ పుష్ప పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
చెన్నై: మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించబడిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు సోమవారం నాడు చుక్కెదురయింది. పార్టీ అధినేత్రి ఎన్నిక విషయంలో మాట్లాడేందుకు మీకు అర్హత లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగా శశికళను ఎన్నుకోవడం సరికాదని శశికళ పుష్ప హైకోర్టును ఆశ్రయించారు. దానిని ఈ రోజు హైకోర్టు తోసిపుచ్చింది. పార్టీలో పదవుల నియామకంపై ప్రశ్నించే అర్హత శశికళ పుష్ప లేదా ఆమె భర్తకు లేదని చెప్పింది.
కాగా, శశికళ పార్టీ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాలేదు.. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని అభిమానులు, నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన ఎంపీ తంబిదురై కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పార్టీ పదవి, ప్రభుత్వ పదవి వేర్వేరుగా ఉన్న ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. రెండు వేర్వేరు అధికార కేంద్రాలు ఎప్పటికీ మంచివి కాదన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సి ఉందన్నారు.