దినకరన్ ఇష్యూ: ఈసిపై భగ్గుమన్న మద్రాస్ హైకోర్టు
దినకరన్ వ్యవహారంపై పోలీసులు ఈసికి ఫిర్యాదు చేయకపోవడంపై మద్రాసు హైకోర్టు భగ్గుమంది. ఇతరులు ఫిర్యాదు చేసేంత వరకు ఆగుతారా అని ప్రశ్నించింది.
చెన్నై: అన్నాడియంకె నేత దినకరన్ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు ఎన్నికల సంఘంపై భగ్గుమంది. ఆర్కేనగర్ ఎన్నికల ప్రచార సమయంలో అధికార అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్, ఆ పార్టీ వర్గీయుల ఓటర్లకు నగదు పంపిణీ చేసిన సంఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆర్కేనగర్లో ఓటుకు రూ.4వేల చొప్పున అధికార అన్నాడియంకెకు చెందినవారు నగదు పంపిణీ చేశారని, ఐటీ దాడుల్లో ఆ నియోజకవర్గంలో రూ.89 కోట్ల దాకా నగదు పంపిణీ జరిగినట్టు ఆధార పత్రాలు కూడా లభించాయని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటుకు నోటిచ్చిన దినకరన్ ఆయన వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చెన్నై పెరియార్ నగర్ న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బేనర్జీ, న్యాయమూర్తి ఎం. సుందర్లతో కూడిన ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది నళిని చిదంబరం వాదించారు. ఆర్కేనగర్ నియోజకవర్గంలో 2 లక్షలమంది ఓటర్లకు ఓటుకు నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారని, ఈ విషయంపై ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె ఆరోపించారు.
ఓటర్లకు నోట్లు పంపిణీ చేసినవారిపై సోమవారం మహానగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బేనర్జీ జోక్యం చేసుకుంటూ - ఓటుకు నోటుపై ఇతరులు ఫిర్యాదు చేసేంతవరకూ ఊరకుండటం భావ్యంకాదని, నిష్పక్షపాతం, నిజాయితీగా వ్యవహరించే ఎన్నికల సంఘం ఈ విషయంలో ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం గర్హనీయమని అన్నారు.
ఓటర్లకు భారీగా నగదు పంపిణీ చేసినట్టు తగిన ఆధారాలు మెండుగా ఉన్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నళిని చిదంబరం గుర్తు చేశారు. అధికార పార్టీవారు ఏయే ప్రాంతాల్లో ఎవరెవరికీ నగదు పంపిణీ చేశారనే వివరాలన్నీ ఎన్నికల సంఘం అధికారులకు తెలుసునని అన్నారు.
అధికార అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన తదితరులు నియోజకవర్గమంతటా నోట్లను వెదజల్లి ఓట్ల వేట సాగించారని ఆరోపించారు. నోట్లను పంపిణీ చేసినవారిపైనా, నగదును తీసుకున్న ఓటర్లపైనా చర్యలు తీసుకోవాలని వాదించారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తులు ఆరు వారాలలోపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.