మ్యాగీ నూడుల్స్ వివాదం, చిక్కుల్లో బాలీవుడ్ తారలు: మాధురీ ట్వీట్
లక్నో: మ్యాగీ నూడుల్స్లో మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) ఉందంటూ తలెత్తిన వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను నెస్ట్లే ప్రతినిధులను కలిశానని, ఆహారం విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోను రాజీపడమని వారు తనకు చెప్పారన్నారు.
చాలామందిలాగే, తాను మ్యాగీ నూడుల్స్ను చాలా ఏళ్లుగా ఆస్వాదిస్తున్నానని, ఇటీవల నెస్లే ప్రతినిధులను కలిశానని చెప్పారు. తాము వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తామని తనతో వారు చెప్పారని మాధురీ దీక్షిత్ పేర్కొన్నారు.
కాగా, ప్రముఖ బాలీవుడ్నటి మాధురీ దీక్షిత్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మ్యాగీ నూడుల్స్లో మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) ఉందంటూ వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటనలో నటించిన మాధురీకి ఉత్తరప్రదేశ్ ఆహార, ఔషధ సంస్థ నోటీసులు జారీచేసింది.
రెండు నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం సిద్ధమంటూ ప్రకటనలో కనిపించిన మాధురీ పదిహేను రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో ఈ బాలీవుడ్ నటిపై కేసు నమోదు చేస్తామని యూపీ ఆహార భద్రత అధికారి మహిమానంద్ జోషి తెలిపారు.
మ్యాగీలో పరిమితికి మించి అనారోగ్యకారకాలున్నాయని వస్తున్న ఆరోపణల విషయంలో నెస్ట్లె ఇండియాపై విచారణ జరిపించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థను కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆదేశించారు.
అంతేకాకుండా, జాతీయ వినియోగదారుల వివాదాలు, పరిహారాల సంస్థ (ఎన్సీడీఆర్సీ)తో ‘క్లాస్ యాక్షన్ సూట్' దాఖలు చేయించాలన్నారు. అయితే తమ గ్రూప్పై వచ్చిన ఆరోపణలను నెస్ట్లె ఇండియా ఖండించింది. మ్యాగీ నూడుల్స్ను ప్రమోట్ చేస్తున్న మాధురి, అమితాబ్, ప్రీతిజింతాలకు చిక్కులు తెచ్చిందని చెప్పవచ్చు.