ప్రయాగ్ రాజ్ ఫ్లైట్ టికెట్ రూ.50 వేలు ? మౌని అమావాస్య వేళ..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల పోటు కొనసాగుతోంది. దేశ విదేశాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే కుంభమేళా మొదలైనప్పటి నుంచి 12 కోట్లకు పైగా భక్తులు తరలివచ్చారు. ఇప్పుడు మౌని అమావాస్య రోజు మరిన్ని రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విమానాల ఛార్జీలు మంటపుట్టిస్తున్నాయి.
ఎల్లుండి మౌని అమావాస్య కావడంతో మహా కుంభమేళాకు వచ్చే వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి ప్రయాగ్ రాజ్ కు వచ్చే విమానాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చేశాయి. ఈ రెండు రోజుల్లో ప్రయాగ్ రాజ్ కు వచ్చే విమానాల ఛార్జీలు ఏకంగా 600 శాతం పెరిగి 50 వేలకు చేరుకున్నట్లు ఎయిర్ లైన్ సంస్ధల డేటా చెబుతోంది.

ట్రావెల్ పోర్టల్ స్కైస్కానర్ ప్రకారం చూస్తే ఢిల్లీ-ప్రయాగ్రాజ్ విమానాల కోసం విమాన టిక్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. ఇవాళ ఉదయం 11 గంటల నాటికి వన్-వే-టికెట్ల ధర రూ.21,000. ముంబై నుండి ప్రయాగ్రాజ్ టిక్కెట్ల ధర రూ.22,000-రూ.60,000గా ఉంది. బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులకు రూ.26,000 ఉండగా.. డైరెక్ట్ వన్ వే టికెట్ అయితే రూ.48 వేలు పలుకుతోంది. సాధారణ రోజుల్లో ఇది 5వేలు మించి ఉండదు. దీంతో డీజీసీఏ వీటిపై ఫోకస్ పెట్టింది.
ఎయిర్ లైన్ సంస్ధలు కుంభమేళాకు వచ్చే భక్తులను దోచుకుంటున్నాయన్న విమర్శల నేపథ్యంలో డీజీసీఏ స్పందించింది. అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుంటున్నట్లు తెలిపింది. అలాగే అదనపు ధరలు వసూలు చేస్తున్న విమానయాన సంస్ధలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications