మహాకుంభ్ 2025: భారతదేశం మొత్తం ఒక్క చోట..ఆధ్మాత్మిక శోభ..!!
భారతదేశాన్ని అన్వేషించాలనుకుంటున్నారా.. అయితే మీరు మహాకుంభమేళకు రావాల్సిందే.ఇదే మంత్రాన్ని ప్రపంచ దేశాలకు చెబుతోంది భారత్. ఔను.. చల్లటి సాయంత్రం వేళ ఢిల్లీలోని ది అశోక హోటల్ ఒక్కసారిగా ఆధ్మాత్మికతతో నిండిపోయింది. భారతదేశం యొక్క ఆధ్మాత్మికత, సంస్కృతుల వారసత్వం ఇక్కడ కనిపించింది.
ఉత్తర్ ప్రదేశ్ పర్యాటక శాఖ మహా కుంభమేళ 2025 కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు, అంబాసిడర్లు,హైకమిషనర్లు హాజరయ్యారు. ప్రయాగరాజ్ యొక్క ఘనకీర్తి వేదిక వద్ద అనువణువున కనిపించింది. ఈ వాతావరణం ఒక ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.

కేంద్ర పర్యాటక,సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్కృతిశాఖ మంత్రి జైవీర్ సింగ్లు వేదికను అలంకరించడంతో కార్యక్రమం ప్రారంభమైంది.భారత దేశపు గత శతాబ్దాల సంప్రదాయాలు, సంస్కృతులు,ఘన చరిత్రను జ్ఞప్తికి తెచ్చాయి. ఈ కార్యక్రానికి విచ్చేసి అతిథులకు మహాకుంభమేళ చరిత్రను వివరించారు. అంతేకాదు సంప్రదాయ నృత్యకళాకారులు, సంగీత కళాకారులు ఇచ్చిన ప్రదర్శన అద్భుతం అమోఘం. ఏకంగా సంగమం వద్దకే వెళ్లినట్లుగా అతిథులు అనుభూతిని పొందారు.

ఇక కేంద్రమంత్రి షెకావత్ ఇచ్చిన ప్రసంగం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అతిథులను ఆకట్టుకుంది. "అఖండ భారతావనిని ఒక్క చోట చూడాలనుకుంటే మహాకుంభమేళను సందర్శించాల్సిందే" అన్న మాటల్లో భారతదేశ ఆధ్యాత్మికత ఉట్టిపడింది. ఇక మహాకుంభమేళకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానం పలుకుతూ కొన్ని లక్షల మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అతిథులకు బస ఏర్పాట్లు, రవాణా సౌకర్యం, అక్కడి ప్రాంతం యొక్క చరిత్రను తెలుసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జైవీర్ సింగ్ కూడా తన ప్రసంగంతో అతిథులను ఆకట్టుకున్నారు. మహాకుంభమేళ 2025 భారత దేశ యొక్క భిన్నత్వంలో ఏకత్వం అనే సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. వసుదైక కుటుంబం అనేదానికి భారత్ ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పారు.మహాకుంభమేళ ఒక మతపరమైన వేడుక అని చెప్పడం కంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భిన్న సంస్కృతులు, ఆలోచనలు ఒక్క చోట కలిసే వేదికగా నిలుస్తుందని అన్నారు.

ఇక సాయంత్రం వేళ జరిగిన ఈ కార్యక్రమానికి మొత్తం హైలైట్గా నిలిచింది మాత్రం టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన ప్రెజెంటేషన్. చక్కటి విజువల్స్తో మహాకుంభమేళకు చేస్తున్న ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు.పరేడ్ గ్రౌండ్ వద్ద టెంట్ సిటీ నుంచి మహారాజా టెంట్లవరకు, ఆధునిక స్విస్ కాటేజీలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.సంగం పై నుంచి హెలికాఫ్టర్ల రైడ్లు,వాటర్ స్పోర్ట్స్,ఇతర సాంస్కృతిక విభావరితో మరింత అందం వస్తుందని, మంచి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారని ప్రెజెంటేషన్ ద్వారా అతిథులకు వివరించారు.
మలేషియా, సీషెల్స్,స్విట్జర్లాండ్,నేపాల్ నుంచి వచ్చిన హైకమిషనర్లు ఆధ్యాత్మికత అనుభూతికి లోనయ్యారు. ఖండాలు, మతాలతో సంబంధం లేకుండా ఈ మహాకుంభమేళ వివరణాత్మక కార్యక్రమానికి హాజరవడం నిజంగా హర్షించదగ్గ విషయం.ఇక ఈ కార్యక్రమంలో మహాకుంభమేళ యొక్క లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. ఇది చూసిన ఆహుతులకు ఒళ్లు గొగుర్పాటుకు గురైంది. ఇది చూశాక మహాకుంభమేళ ఇంత గొప్పగా ఉంటుందా అన్న చర్చ వారి మధ్య మొదలైంది.

ఇక సాయంకాలం వేళ ముగుస్తున్న కొద్దీ మహాకుంభ్ 2025 ప్రీఈవెంట్ కూడా ముగింపునకు చేరుకుంది.జీవిత కాలంలో ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళలో విశ్వాసం,సంస్కృతి,మానవత్వం ఇలా మనిషిలో ఎన్నో మార్పులు తీసుకొస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు ఈ చక్కటి అనుభూతిని నెమరేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మహాకుంభమేళ కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఆధ్మాత్మికతను సంతరింపజేస్తుందనే నమ్మకం అందరిలో కలిగింది.












Click it and Unblock the Notifications