ఉప ముఖ్యమంత్రి చేతికి హోం: రేపే మంత్రివర్గ విస్తరణ
ముంబై: మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం ఇద్దరితోనే నడుస్తోన్న మంత్రివర్గంలో కొత్తగా 22 మంది రానున్నారు. ఆయా శాఖల పంపకాలకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. తుది జాబితాపై భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఆమోదముద్ర కూడా వేసింది. దీనితో మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది.
Recommended Video
రాజకీయాల్లోకి రీఎంట్రీపై తేల్చేసిన రజినీకాంత్: నిన్న చంద్రబాబుతో..ఇవ్వాళ గవర్నర్తో భేటీ
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. మంత్రులు, శాఖల కేటాయింపులకు సంబంధించిన జాబితాను సంకీర్ణ కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీకి అందజేశారు. దీనిపై ఆమోద ముద్ర వేయించుకున్నారు. బీజేపీ సహకారంతో శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్నాథ్ షిండే.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి వేంద్ర ఫడ్నవిస్ ఇద్దరే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ వీరిద్దరే ఆయా శాఖల రోజువారీ సమీక్షలు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వస్తోన్నారు. ఇక తాజాగా మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నారు. మంత్రివర్గంలోకి కొత్తగా 22 మందిని తీసుకోనున్నారు. కీలకమైన హోం శాఖ.. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతికి వెళ్లడం దాదాపు ఖాయమైంది.
కాగా- శివసేన పార్టీ ఎవరిదనే విషయం.. ప్రస్తుతం విచారణలో ఉంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల గుర్తు తమకే దక్కాలంటూ వాదిస్తోన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కూడా శివసేన గుర్తింపు కోసం న్యాయపోరాటం సాగిస్తోన్నారు. అసలైన శివసేన తమదేనంటూ నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ ఇద్దరిని సూచించింది.