లాక్డౌన్ పీరియడ్లో 25 అడుగుల లోతు బావి రెడీ: భార్యభర్తల స్ఫూర్తి: నీటి ఎద్దడి పరార్..!
ముంబై: దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ..ఇంటికి పరిమితమైన కోట్లాదిమంది టీవీలు, పబ్జీ గేములు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తోన్న సమయంలో..ఇద్దరు దంపతులు సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. 21 రోజుల తొలిదశ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తమ కోసమే కాదు.. తమ ఊరు మొత్తానికీ నీటి ఎద్దడిని తీర్చే మంచి పని చేశారు. వారు చేసిన ఈ పని పట్ల ప్రశంసలు అందుతున్నాయి. కోట్లాదిమందికి స్ఫూర్తినింపాయి.
21 రోజుల లాక్డౌన్లో 25 అడుగుల బావి..
మహారాష్ట్రలోని వశీం జిల్లా కర్ఖేడా గ్రామంలో నివసించే గజానన్ పక్మోడె, ఆయన భార్య ఈ బావిని తవ్వారు. గజానన్ భవన నిర్మాణ కార్మికుడు. కరనా వైరస్ను వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కిందటి నెలలో తొలి విడత లాక్డౌన్ను ప్రకటించిన రెండోరోజు వారు ఈ బావిని తవ్వడం ఆరంభించారు. తమ పూరిల్లు వెనుక ఉన్న ఖాళీ స్థలంలో బావిని తవ్వారు. అయిదు అడుగుల విస్తీర్ణంలో బావిని తవ్వారు. రోజూ ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల లోతు కంటే ఎక్కువ తవ్వలేదు. 21వ రోజుల లాక్డౌన్ ముగిసే సమయానికి ఆ బావి లోతు కాస్తా 25 అడుగులకు చేరుకుంది.
నీళ్లు పడతాయా? లేదా అనే సందేహంతో..
వశీం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువ. మంచి వర్షాలు పడినప్పటికీ.. నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఆ గ్రామంలో లేదు. అందుకే గజానన్ బావిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన భార్యకు చెప్పగా ఆమె కూడా అందుకు అంగీకరించారు. లాక్డౌన్ ప్రకటించిన రెండోరోజు బావిని తవ్వడాన్ని ప్రారంభించారు. 10 నుంచి 12 అడుగుల లోతుకు వెళ్లిన తరువాత నీళ్లు పడతాయా? లేదా అనే అనుమానం పట్టి పీడించిందని, నీళ్లు పడకపోయినా నిల్వ ఉంచుకోవడానికైనా ఉపయోగపడుతుందని భావించానని గజానన్ చెప్పారు.
20 అడుగుల లోతులో..
సుమారు 20 అడుగుల లోతుకు వెళ్లిన తరువాత నీటి తడి తగిలిందని, ఆ సమయంలో తమ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని గజానన్ అన్నారు. తవ్వుతున్న కొద్దీ నీటి ఊట వెలికి వస్తూనే ఉందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసిన అనుభవం తనకు ఉపయోగ పడిందని చెప్పారు. ఫలితంగా పెద్దగా శ్రమ అనేది తెలియకుండా పోయిందని అన్నారు. భార్యతో కలిసి అంత్యాక్షరి ఆడుకుంటూ మూడు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే బావిని తవ్వామని అన్నారు. తాము అనుకోకుండా చేసిన ఈ పని.. గ్రామం మొత్తానికీ ఉపయోగపడుబోతోందని గజానన్ చెప్పారు.
Recommended Video
వశీం జిల్లాలో సగటున వెయ్యి మిల్లీ మీటర్ల వర్షం
మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన విదర్భ రీజియన్ పరిధిలోకి వస్తుంది ఈ వశీం జిల్లా. వర్షాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. కేంద్ర భూగర్భ జల కమిషన్ లెక్కల ప్రకారం.. వశీం జిల్లాలో ఏటా పడే సగటు వర్షపాతం 966 మిల్లీ మీటర్లు. వర్షపు నీటిని దుర్వినియోగం చేసుకోకుండా ఉండటానికి పెద్దగా ప్రాజెక్టులు గానీ, వనరులు గానీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో తమ గ్రామంలో కనీసం కొంతమేరకైనా నీటిని నిల్వ ఉంచుకోవడానికి బావిని తవ్వాలని నిర్ణయించుకున్నామని, దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చామని గజానన్ అన్నారు.