కరోనా విలయం: మహారాష్ట్ర సంచలనం -పూర్తిస్థాయి లాక్డౌన్ లేదన్న సీఎం ఉద్ధవ్ -ప్రధాని మోదీపై ఫైర్
భారత్లో నమోదవుతోన్న కొవిడ్ కేసుల్లో 40 శాతానికి పైగా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తుండటం, కొత్త కేసులు, మరణాలు గుట్టలా పెరిగిపోతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ తప్పదనే వాదన తెరపైకి వచ్చింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆంక్షలు సైతం విధించారు. అయితే.. పూర్తి స్థాయి లాక్ డౌన్ విధింపునకు మాత్రం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిరాకరించారు. మంగళవారం రాత్రి ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. కొవిడ్ నియంత్రణలో కేంద్రం తీరు, రాష్ట్రాలకు అది అందిస్తోన్న సహకారంపై ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఉద్ధవ్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

ఎమర్జెన్సీ పరిస్థితి..
''కరోనా వైరస్ కేసులు, వైరస్ వ్యాప్తికి సంబంధించి మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత ప్రమాదరకంగా ఉంది. దీనిని ఎమర్జెన్సీ సిట్యువేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా ఆంక్షలు విధించాం. కొవిడ్ ను కంట్రోల్ చేయడానికి రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన ఆంక్షలను తీసుకొస్తున్నాం. అయితే రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టనుగాక పెట్టను. ఎందుకంటే లాక్ డౌన్ వల్ల కోట్ల మంది పేదల జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అందరూ బతకాలన్న ఉద్దేశంతోనే మేం లాక్ డౌన్ కు నో చెబుతున్నాం. అయితే, ఆంక్షలను మాత్రం కఠినంగా అమలు చేస్తాం..

హోటళ్లలో నిలబడి తినడం నిషేధం..
మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ నియంత్రణకు కొత్త నిబంధలు అమలులోకి వస్తాయి. బుధవారం నుంచి హోటళ్లు, వీధిలో బండ్ల వద్ద ప్రజలు నిలబడి తినడం పూర్తిగా నిషేధం. హోం డెలివరీలకు మాత్రమే అనుమతస్తాం. మిగతా ఆంక్షలకు సంబంధించి సమగ్ర ఆదేశాలు జారీ చేస్తాం. కొవిడ్ ఆంక్షల కారణంగా ప్రభావితమయ్యే పేదల కోసం నిత్యావసరాలు సరఫరా చేస్తాం.

కేంద్రం ఏం చేస్తోంది?
దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మహారాష్ట్రలోనైతే పరిస్థితి ఇంకాస్త ఆందోళనకరంగా ఉంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ విలయకాలంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం అనివార్యమైంది. అదే సమయంలో ప్రజలు కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తన శక్తికి మించి మహమ్మారితో పోరాడుతున్నది. అయితే, కరోనాకు సంబంధించిన చాలా విషయాలు కేంద్రం తన పరిధిలోనే ఉంచుకుందన్నది కాదనలేని వాస్తవం..

మహారాష్ట్రకు జీఎస్టీ మినహాయింపు..
కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మహారాష్ట్రలో ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండెర్ల కొరత ఏర్పడింది. కేంద్రంలోని మోదీ సర్కారు వెంటనే స్పందించి, రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాలి. కొవిడ్ అనేది నిజంగా అతిపెద్ద విపత్తులా మారింది. పెద్ద వ్యాపారాల నుంచి వీధి వ్యాపారుల దాకా ప్రతి ఒక్కరూ దీని ప్రభావానికి గురయ్యారు. గడిచిన ఏడాది కాలంగా కొవిడ్ కారణంగా అన్ని రకాల వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతిన్నాయి. కొవిడ్ వల్ల దెబ్బతిన్న చిరు వ్యాపారులను ఆదుకోడానికి కేంద్రం ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. మహారాష్ట్రకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ దశగా కేంద్రం సీరియస్ గా ఆలోచించాలి.

మోదీ విచిత్ర వేషాలు..
కొవిడ్ దెబ్బకు అన్ని దేశాలూ ప్రభావితం అయ్యాయి. కానీ చాలా దేశాల్లో ప్రజల్ని ఆదుకోడానికి ఆయా ప్రభుత్వాలు ఎన్నెన్నో పథకాలు, కొత్త ఆలోచనలను అమలు చేస్తున్నాయి. పేదలకు నేరుగా డబ్బులు ఇవ్వడం దగ్గర్నుంచి, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఆర్థిక సహకారాలు ప్రకటించాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. కానీ మన కేంద్రం మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తున్నది. హడావిడిగా వ్యాక్సిన్ వారోత్సవాలను ప్రకటించారు, కానీ చాలా కేంద్రాల్లో టీకాలు నిండుకున్నాయి.












Click it and Unblock the Notifications