శివసేనతోనే ప్రభుత్వ ఏర్పాటు.. విభేదాలు లేవు.. అభిప్రాయ భేదాలే : ఫడ్నవీస్
ముంబై : శివసేనతో అభిప్రాయ భేదాలే తప్ప విభేదాలు లేవని స్పష్టం చేశారు బీజేపీ ఎల్పీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం బీజేపీ-శివసేన కూటమి సమష్టి కృషియే తప్ప ఏ ఒక్క పార్టీకో క్రెడిట్ దక్కబోదని వెల్లడించారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై ఫడ్నవీస్ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో బీజేపీ - శివసేన కూటమికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు.
ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీదే అంతిమ నిర్ణయమని వ్యాఖ్యానించిన ఫడ్నవీస్.. 50-50 ఫార్ములా లెవనెత్తుతున్న శివసేన నేతలు పునరాలోచన చేస్తే మంచిదని సూచించారు. ఏనాడూ కూడా అధికారం చెరో సగమని బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదని.. అసలు అలాంటి ప్రస్తావనే రాలేదని చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం మాత్రం సమష్టి కృషి కారణంగానే సాధ్యమైందన్నారు.
మహారాష్ట్ర అదృష్టం ఎలా ఉందో.. జరగాల్సిందే జరుగుతుంది.. శివసేన నేత సంచలన వ్యాఖ్యలు
Hon CM Shri @Dev_Fadnavis elected leader of Maharashtra BJP legislative party pic.twitter.com/7ocDX6RCAk
— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) October 30, 2019
పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లామని.. ప్రజలు కూడా బీజేపీ - శివసేన కూటమిని చూసే ఓట్లేశారని వ్యాఖ్యానించారు. అందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని.. అయితే ముఖ్యమంత్రి పీఠంలో భాగస్వామ్యం అనేది మంచిది కాదనే విషయం శివసేన నేతలకు అర్థమయ్యేలా చెబుతామన్నారు. చివరకు శివసేన భాగస్వామ్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ విషయంలో సందేహాలకు తావు లేదన్నారు.
శివసేనతో బీజేపీకి విభేదాలు లేవని స్పష్టం చేశారు ఫడ్నవీస్. ఉన్నదల్లా అభిప్రాయ భేదాలే తప్ప మరొకటి కాదన్నారు. శివసేన కొన్ని డిమాండ్లు పెట్టిందని.. ఆ క్రమంలో ఇరు పార్టీల నేతలు కలిసి వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. త్వరలోనే సమస్య చల్లబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.