హోం మంత్రికి సోకిన కరోనా: రెండు డోసుల టీకా తీసుకున్నా వదలని వైరస్: కొత్తగా 733 మంది బలి
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ మళ్లీ మొదలైందా? రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం కదా.. అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దాని బారిన పడటం ఖాయమేనా? ఈ మహమ్మారి నిర్మూలన అయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తోన్న హెచ్చరికలను పాటించక తప్పదా?- అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. దేశంలో క్రమంగా కరోనా కొత్త స్వరూపం ఏవై.4.2 వేరియంట్ క్రమంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్లల్లో ఈ వైరస్ జాడలు కనిపించాయి.
హోంమంత్రికి సోకిన వైరస్..
ఈ పరిస్థితుల మధ్య మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్.. కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలను చేయించుకున్నారు. పాజిటివ్గా తేలింది. ఆయన కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే ఆయన నాగ్పూర్, అమరావతిల్లో పర్యటించారు. పలు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ప్రజలను కలుసుకున్నారు.
అప్రమత్తంగా..
ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మరింత మందికి ఈ వైరస్ సోకి ఉండటానికీ అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. కాగా- ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ తక్షణమే కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని దిలీప్ వాల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఐసొలేషన్లో
ప్రస్తుతం దిలీప్ వాల్సే పాటిల్.. ఐసొలేషన్లో కొనసాగుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. వారి సలహాలను తీసుకుంటున్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, పార్టీ నాయకులు, అనుచరులు, అభిమానులు ఆందోళనకు గురి కావద్దని అన్నారు. త్వరలోనే తాను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని, ఎప్పట్లాగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. కరోనా వైరస్ నుంచి వేగంగా కోలుకోవాలని ఆశిస్తూ- ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సందేశాన్నిపంపించారు.
కొత్తగా 733 కరోనా మరణాలు..
కాగా- దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 16,156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 733 మంది మరణించారు. 17,095 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మరణాలు ఈ స్థాయిలో పెరగడం.. చాలాకాలం తరువాత ఇదే తొలిసారి. ఒక్కరోజులో 733 మంది మరణించడాన్ని బట్టి చూస్తోంటే.. ఉధృతి మళ్లీ పెరిగిందనే సంకేతాలను పంపించినట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 3,42,31,809కు చేరుకున్నాయి. ఇందులో 3,36,14,434 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
Recommended Video
వ్యాక్సిన్ వేసుకున్నా..
యాక్టివ్ కేసుల సంఖ్య 1,60,989గా రికార్డయింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుగున్నర లక్షలను దాటింది. ఇప్పటిదాకా 4,56,386 కరోనా కాటుు బలి అయ్యారు. మరోవంక దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుగా సాగుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య వంద కోట్ల ల్యాండ్ మార్క్ను అధిగమించింది. ఈ పరిస్థితుల్లో- రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఈ వైరస్ బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.