సాధువులను కొట్టి చంపిన జనం: అనేక అనుమానాలు..పిల్లల్ని చంపి, కిడ్నీలతో: అత్యున్నత దర్యాప్తు
ముంబై: మహారాష్ట్రలో భయానక మూకదాడి చోటు చేసుకుంది. ఇద్దరు సాధువులు సహా ముగ్గురిని స్థానికులు కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న వారిలో 110 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూకదాడిపై మహారాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని గడ్చించలే గ్రామంలో నాలుగు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నపిల్లలను ఎత్తుకుని వెళ్తున్నారనే పుకార్లు కొద్దిరోజులుగా పాల్ఘర్ జిల్లాలో వెలువడుతున్నాయి. పిల్లలను చంపి, వారి కిడ్నీలను దొంగిలిస్తున్నారనే వదంతులు వణికించాయి. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వాహనాల్లో అపరిచితులు తిరుగాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనితో అప్రమత్తమైన గ్రామస్తులు.. 24 గంటల పాటు వంతులవారీగా కాపలా ఉంటున్నారు.

అదే సమయంలో గడ్చించలే గ్రామం గుండా ఖన్వెల్ వైపు ఓ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. డ్రైవర్ సహా అందులో ఇద్దరు సాధువులు ఉన్నారు. గ్రామస్తులు వారిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఎక్కడికెళ్తున్నారంటూ నిలదీశారు. దానికి వారు సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోవడంతో గ్రామస్తుల అనుమానాలు మరింత బలపడ్డాయి. వారిని వాహనంలో నుంచి బయటికి లాగి.. మూక దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టానుసారంగా కొట్టారు. దీనితో ఆ ముగ్గురూ సంఘటనా స్థలంలోనే మరణించారు.
మృతులను సుశీల్గిరి మహరాజ్, నీలేష్ తేల్గడే, జయేష్ తేల్గడేగా గుర్తించారు. పాల్ఘర్ నుంచి నాశిక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సంఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ.. ఏమీ చేయలేకపోవడం కనిపించింది. మూకదాడికి పాల్పడుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఉండటం వారేమీ చేయలేకపోయారని అంటున్నారు.

తమను సాధువులు వదిలేయాలంటూ ప్రాధేయపడుతున్నప్పటికీ.. గ్రామస్తులు పట్టించుకోకపోవడం, రాళ్లు, కర్రలు, చేతులకు అందిన వస్తువులతో దాడి చేయడం అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. దాడితో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలను ఎదుర్కొంటున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పాల్ఘర్ పోలీసులు. మొత్తం 110 మందిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పాల్ఘర్ మూకదాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా వెల్లడించింది. ఎవ్వర్నీ వదిలి పెట్టబోమని పేర్కొంది.












Click it and Unblock the Notifications